50 సిక్స్ల క్లబ్లో చేరిన ధోని
ధోని 13వ ఓవర్లో 50 సిక్స్ల క్లబ్లో చేరిన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఈ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్కి ముందు 50 సిక్స్ల క్లబ్లోచేరడానికి ధోనికి ఒక సిక్స్ అవసరం కాగా, కోహ్లీకి రెండు సిక్సులు అవసరమయ్యాయి. ఆసీస్ బౌలర్ నాథన్ కౌల్టర్-నైల్ వేసిన 16వ ఓవర్లో వరుసగా మూడు సిక్స్లు బాదాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా కోహ్లీ (104) నిలిచాడు. ఈ క్రమంలో డివిలియర్స్ (102)ను దాటేశాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (150) ఉన్నాడు.
చిన్నస్వామి స్టేడియంలో టీ20ల్లో 2500 పరుగులు
అంతేకాదు ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడే కోహ్లి.. ఈ మ్యాచ్తో చిన్నస్వామి స్టేడియంలో టీ20ల్లో 2500 పరుగులు కూడా పూర్తి చేశాడు. ఇక, భారత్ తరుపున టీ20ల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో.. రోహిత్ శర్మ 102 సిక్స్లతో అగ్రస్థానంలో ఉండగా.. యువరాజ్ 74 సిక్స్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనా 58 సిక్స్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు ధవన్ (14), రాహుల్ మంచి ఆరంభాన్నిచ్చారు.
పవర్ప్లేలో 53 పరుగులు రాబట్టిన టీమిండియా
తొలి నాలుగు ఓవర్లలో మూడు ఫోర్లే వచ్చినా.. ఐదో ఓవర్లో రాహుల్ జోరు చూపెట్టాడు. రిచర్డ్సన్ వరుస బంతులను రెండు సిక్సర్లుగా మిలిచాడు. ఆ తర్వాతి ఓవర్లో కమిన్స్ను కూడా మిడ్వికెట్, బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో పవర్ప్లేలో టీమిండియా 53 పరుగులు చేసింది. ఆ తర్వాత కౌల్టర్-నైల్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన రాహుల్ నేరుగా థర్డ్మ్యాన్లో రిచర్డ్సన్కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా తొలి వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
మిడ్వికెట్ మీదుగా భారీ సిక్సర్తో ఖాతా తెరిచిన ధోని
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.... మరో ఓపెనర్ ధావన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, 10వ ఓవర్లో ధావన్... 11వ ఓవర్లో రిషబ్ (1) చెత్త షాట్తో మూల్యం చెల్లించుకున్నాడు. కేవలం 10 బంతుల తేడాలో ఈ ఇద్దరూ ఔట్కావడంతో భారత్ 74 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కోహ్లీ ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి టీ20లో నెమ్మదిగా ఆడాడని విమర్శలు ఎదుర్కొంటున్న ధోని షార్ట్ బౌలింగ్లో మిడ్వికెట్ మీదుగా భారీ సిక్సర్తో ఖాతా తెరిచాడు.
29 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ
వేగంగా స్ట్రయిక్ను రొటేట్ చేసిన కోహ్లీ 16వ ఓవర్లో వరుసగా 6, 6, 6తో 22 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో 20వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 18వ ఓవర్లో ధోనీ.. 6, 6, 4తో 19 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్లో కోహ్లీ సిక్స్, ఫోర్ బాదినా.. ఆఖరి ఓవర్లో ధోని ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్కు 50 బంతుల్లోనే 100 పరుగులు జతయ్యాయి. తర్వాత కార్తీక్ (8 నాటౌట్) రెండు ఫోర్లు బాదగా.. ఆఖరి బంతిని కోహ్లీ సూపర్ సిక్స్తో ముగించాడు. దీంతో చివరి 9 ఓవర్లలో 116 పరుగులు వచ్చాయి.
మ్యాక్స్వెల్ సెంచరీతో ఆసీస్ విజయం
అనంతరం టీమిండియా నిర్ధేశించిన 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ (113నాటౌట్; 55బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులు) సెంచరీతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో రెండు టీ20ల సిరిస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో 11 ఏళ్ల తర్వాత భారత్పై టీ20 సిరిస్ను గెలిచినట్లు అయింది. 2008 మెల్బోర్న్లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు. చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది.