2008లో తొలిసారి:
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. వన్డే కెరీర్లో రెండోసారి ఒక ఏడాదిని శతకం లేకుండా ముగిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ సాధించిన కోహ్లీ.. 2008లో నేరుగా భారత జట్టులోకి ప్రవేశించాడు. దంబుల్లాలో శ్రీలంకపై అరంగేట్రం చేసి 12 పరుగులు చేశాడు. ఆ ఏడాది ఐదు మ్యాచులు ఆడినప్పటికీ.. సెంచరీ మాత్రం సాధించలేదు. ఒక అర్ధ శతకంతో ఆ ఏడాదిని ముగించాడు. అయితే ఆ తర్వాత నుంచి అతడి బ్యాటు నుంచి సెంచరీలు వరుసగా వచ్చాయి. దాంతో ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే ఆటగాడిగా మారాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
2020లో ఒక్క సెంచరీ బాదని విరాట్:
2009లో 1, 2010లో 3, 2011లో 4, 2012లో 5, 2013లో 4, 2014లో 4, 2015లో 2, 2016లో 3, 2017లో 6, 2018లో 6, 2019లో 5 మొత్తంగా 43 శతకాలు బాదేశాడు విరాట్ కోహ్లీ. 2017, 2018లలో అయితే కోహ్లీ ఆరేసి సెంచరీలు చేయడం విశేషం. అలాంటిది 2020లో మాత్రం ఒక్కసారి కూడా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020లో 9 మ్యాచులాడినా విరాట్.. ఒక్క శతకమూ చేయలేదు. అయితే 5 అర్ధ శతకాలు చేశాడు. అందులో రెండుసార్లు 89 స్కోర్లు సాధించాడు. కాగా కోహ్లీ సెంచరీలు బాదేసిన ఏడాదిలో కనిష్ఠంగా 10, గరిష్ఠంగా 34 వన్డేలు ఆడాడు.
ఒకే బౌలర్కు:
విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ వరుసగా నాలుగు వన్డేల్లో ఒకే బౌలర్కు తన వికెట్ సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్వుడ్ ఈ ఘనత సాధించాడు. ఈ సిరీస్ మూడు వన్డేల్లో కోహ్లీని హేజిల్వుడే ఔట్ చేశాడు. అంతకుముందు బెంగళూరులో జరిగిన చివరి వన్డేలోనూ అతడు విరాట్ను ఔట్ చేశాడు. దీంతో కోహ్లీని వరుసగా నాలుగుసార్లు ఔట్ చేసిన తొలి బౌలర్గా నిలిచాడు. ఇప్పటి వరకు ట్రెంట్ బౌల్ట్, జునైద్ ఖాన్, కేన్ రిచర్డ్సన్.కోహ్లీని వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు.
అత్యంత వేగంగా 12 వేల పరుగులు:
వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ మరో కొత్త రికార్డు సృష్టించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కే ఈ మైల్స్టోన్ అందుకోవడానికి 300 ఇన్నింగ్స్ పడితే.. విరాట్ మాత్రం జస్ట్ 242 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో 8000 పరుగుల నుంచి ఇప్పటి వరకు ప్రతి వెయ్యి పరుగుల మైల్స్టోన్ను అత్యంత వేగంగా అందుకున్నది కోహ్లియే కావడం విశేషం. 175 ఇన్నింగ్స్లో 8000 పరుగులు చేసిన విరాట్.. ఆ తర్వాత 9000 పరుగులను 194వ ఇన్నింగ్స్లో, 10000 పరుగులను 205వ ఇన్నింగ్స్లో, 11000 పరుగులను 222వ ఇన్నింగ్స్లో అందుకున్నాడు.
మాస్టర్ రికార్డుకు అతి చేరువగా:
వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 43 సెంచరీలతో అతనికి చాలా దగ్గర్లోనే ఉన్నాడు. నిజానికి విరాట్ తన మునుపటి స్పీడు కనబరచి ఉంటే.. ఇప్పటికే మాస్టర్ రికార్డుకు అతి చేరువగా వెళ్లేవాడు. కానీ వన్డేల్లో చాలా కాలంగా కోహ్లీ సెంచరీ చేయలేదు. అతను చివరిసారి 15 నెలల కిందట సెంచరీ చేశాడు. అప్పటి నుంచీ 44వ సెంచరీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం 32 ఏళ్లు మాత్రమే ఉన్న విరాట్కు ఇంకా చాలా ఏళ్ల కెరీర్ మిగిలే ఉంది. దీంతో వన్డేల్లోనే కాదు.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో మాస్టర్ సాధించిన 100 సెంచరీల రికార్డు కూడా బద్ధలైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.