ప్రపంచకప్ ముందు ఇండియాకు బూస్టప్
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆసీస్ మూడో టీ20లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఆసీస్పై 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా టీ20 ప్రపంచకప్ ముందు మంచి బూస్టప్ అందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 186పరుగులు చేసింది. ఇక 187పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. 19.5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) ఆసీస్ బౌలింగ్ను ఊచకోత కోయగా.. విరాట్ కోహ్లీ (63పరుగులు 48బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) ఎప్పటిలాగే తన ఛేజింగ్ మాస్ట్రో చూపించాడు. ఇక ఉప్పల్ స్టేడియంలో తెలుగు ప్రేక్షకులు ఈ విజయాన్ని ఆసాంతం ఆస్వాదిస్తూ గ్రౌండ్ను అరుపులు, కేకలతో దద్దరిల్లించారు.
రోహిత్, రాహుల్ నిరాశపరిచినా..
ఇక ఛేదనలో భారత్కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ (1) ఔటయ్యాడు. వికెట్లు పడ్డా హిట్టింగ్ ఆపకూడదనే సూత్రాన్ని పాటించిన రోహిత్ (17పరుగులు 14బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) రెండో ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి స్కోరు బోర్డుకు ఊపుతెచ్చాడు. 3వ ఓవర్లో కోహ్లీ ఫోర్ బాది తన టచ్ చూపించాడు.
నాలుగో ఓవర్లో ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన రోహిత్.. నాలుగో బంతికి తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన ఫుల్ షాట్ ఆడాడు. అయితే బంతి ఫ్లాట్గా వెళ్లడంతో ఫీల్డర్ ఛేతికి చిక్కాడు. అయితే రాహుల్, రోహిత్ నిరాశపరిచినా.. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
ఆకాశమే హద్దుగా చెలరేగిన స్కై
ఇక కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్కు ఏకంగా 62బంతుల్లో 104పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక వీరిద్దరు అడపా దడపా ఫోర్లు, సిక్సులు బాదుతూ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లే చివరి ఓవర్లో కోహ్లీ ఫోర్, సిక్స్ కొట్టడంతో స్కోరు 50కి చేరుకుంది.
మ్యాక్సీ వేసిన 8వ ఓవర్లో సూర్య వరుసగా రెండు ఫోర్లు బాది టచ్లోకి వచ్చాడు. జంపా వేసిన 9వ ఓవర్లో కోహ్లీ సిక్స్ బాదగా.. సూర్య ఫోర్ బాది 50పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 10, 11 ఓవర్లలో ఒక్కో సిక్సు బాదిన స్కై.. జంపా వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు సిక్సులు కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 14ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన స్కై.. చివరి బంతికి హిట్ చేయగా.. బౌండరీ వద్ద ఫించ్ అద్బుత క్యాచ్ అందుకోవడంతో ఔటయిపోయాడు.
|
చివర్లో రసవత్తరంగా మ్యాచ్
సూర్య ఇన్నింగ్స్ పట్ల ప్రేక్షకులు మంత్రముగ్ధులై చప్పట్లతో అతన్ని అభినందించారు. కోహ్లీ సైతం వెన్నుతట్టాడు. ఇక క్రీజులో కుదురుకున్న కోహ్లీ వికెట్ కాపాడుతూ ఆడాడు. 16వ ఓవర్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 33వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. గ్రీన్ బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోను కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ మ్యాచ్ విషయంలో కాస్త ఒత్తిడి తెచ్చాడు.
హార్దిక్ (25పరుగులు 16బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) కాస్త తడబడుతూ కన్పించాడు. ఇక చివర్లో చాలా రసవత్తరంగా మ్యాచ్ వచ్చింది. అయితే కోహ్లీ, హార్దిక్ ఒకట్రెండు సిక్సులు కొట్టడంతో సమీకరణం కరుగుతూ వచ్చింది. ఇక చివరి ఓవర్లో 11పరుగులు కావాల్సిన తరుణంలో కోహ్లీ సిక్స్ కొట్టి ఔట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. అయితే 5వ బంతికి హార్దిక్ ఫోర్ బాదడంతో ఇండియా గెలుపొందింది. ఆసీస్ బౌలర్లలో సామ్స్ 2, హాజిల్ వుడ్ 1, కమిన్స్ 1 వికెట్ తీశారు.
తొలుత కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ రాణించడంతో..
భారత బౌలింగ్లో అక్షర్ పటేల్ (4-0-33-3) నాలుగు ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు ఓ కీలక రనౌట్ చేసి రాణించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ కామెరూన్ గ్రీన్ (52పరుగులు 21బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), టిమ్ డేవిడ్ (54పరుగులు 27బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో విధ్వంసం రేపడంతో పాటు డేనియల్ సామ్స్ (28పరుగులు 20బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) చివర్లో రాణించాడు. దీంతో ఆసీస్ 7వికెట్లు కోల్పోయి 186పరుగులు చేయగలిగింది. సహకారమందించాడు.
|
తుది జట్లు :
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ (w), డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్