
హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో మూడో రోజు ఆటకు బ్యాడ్ లైట్ కారణంగా అంతరాయం కలిగింది. శనివారం స్టేడియంలో చిరుజల్లులు పడుతుండటంతో వెలుతురు తక్కువైంది. దీంతో అంఫైర్లు మ్యాచ్ను నిలిపేశారు. టీ విరామం తర్వాత వాతావరణం బ్యాటింగ్కు అనుకూలించలేదు.
దీంతో మరో 16 ఓవర్ల ఆటను రద్దు చేశారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 83.3 ఓవర్లకు గాను ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రస్తుతం పాట్కమిన్స్(25), పీటర్ హాండ్స్కాంబ్(28) క్రీజులో ఉన్నారు. ఇద్దరూ కలిసి 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఇంకా 386 పరుగులు వెనుకబడి ఉంది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ హారిస్ 79, ఉస్మాన్ ఖవాజా 27, లబుచాంగే 38లు మాత్రమే ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు. నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.