విశాఖ పిచ్పై ధోని లాంటి ప్లేయర్కు కష్టమే: మాక్స్వెల్ మద్దతు


హైదరాబాద్: తక్కువ ఎత్తులో బంతులు వస్తున్న విశాఖ పిచ్పై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాళ్లకు కూడా పరుగులు సాధించడం కష్టమేనని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్వెల్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఇన్నింగ్స్లో చివరి వరకు నౌటౌట్గా నిలిచిన ధోని 37 బంతుల్లో 29 పరుగులే చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిచ్పై ధోని స్ట్రైక్రేట్ సరైనదే
దీంతో తొలి టీ20లో టీమిండియా ఓటమికి ధోని అతి ఆత్మవిశ్వాసం కూడా ఓ కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గ్లెన్ మ్యాక్స్వెల్ ధోనికి మద్దతుగా నిలిచాడు. మ్యాక్స్వెల్ మాట్లాడుతూ "ఈ పిచ్పై ధోని స్ట్రైక్రేట్ సరైనదే. వికెట్ అలా ఉన్నప్పుడు ఏ బ్యాట్స్మన్కైనా పరుగులు చేయడం కష్టమే" అని అన్నాడు.

చాహల్ను ఉంచుకొని పవర్ హిట్టింగ్ చేయలేడు
"అవతలి వైపు చాహల్ను ఉంచుకొని ఒక్కడే పవర్ హిట్టింగ్ చేయలేడు. ధోని ప్రపంచ స్థాయి ఫినిషర్. అతడూ బంతిని బాదేందుకు ఇబ్బంది పడ్డాడు. అలాంటప్పుడు మెల్లగా ఆడటంలో తప్పులేదు. ఆఖరి ఓవర్లో అతడు సిక్సర్ బాదడం చూస్తుంటే ఎంత కష్టంగా ఆడుతున్నాడో తెలుస్తుంది" అని మ్యాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు.

ఒకే ఒక్క బౌండరీ బాదిన ధోని
"ఈ మ్యాచ్లో ధోని ఒక్కటే బౌండరీ బాదాడు. దీనిని బట్టి పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోండి. ఇలాంటి పిచ్పై జస్ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్యా లాంటి బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. వారిద్దరూ లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా తక్కువ బౌన్స్తో బంతులు వేయగలరు" అని మాక్స్వెల్ పేర్కొన్నాడు.

కౌల్టర్ నైల్పై మ్యాక్స్వెల్ ప్రశంసలు
ఇక, తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయానికి కారణమైన నాథన్ కౌల్టర్ నైల్పై మ్యాక్స్వెల్ ప్రశంసలు కురిపించాడు. కౌల్టర్ నైల్ అద్భుతమని, ఇలాంటి వికెట్ అతడి బౌలింగ్కు చక్కగా సరిపోతుందని చెప్పాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన కౌల్టర్ నైల్ మూడు వికెట్లు తీసి 26 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications