India vs Australia 3rd T20I: కోహ్లీ ఒంటరి పోరాటం వృథా.. ఆఖరి టీ20 ఆసీస్దే!

సిడ్నీ: ఆసీస్ గడ్డపై భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీ సేన ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 85) ఒంటరి పోరాటం వృథా అయింది. అతనికి తోడుగా మరో బ్యాట్స్మెన్ రాణించకపోవడం, చెత్త ఫీల్డింగ్ భారత్ విజయావకాశాలను దెబ్బతీశాయి. మరోవైపు సమష్టిగా రాణించిన ఆసీస్ అద్భుత విజయాన్నందుకుని క్లీన్ స్వీప్ను తప్పించుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 80), గ్లేన్ మ్యాక్స్వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సుంధర్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, ఠాకుర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ (3/23) భారత పతనాన్ని శాసించగా.. మ్యాక్స్వెల్, అబాట్, టై, జంపా తలో వికెట్ తీశారు.

సిల్వర్ డక్..
187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(0) సిల్వర్ డక్గా పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు. గ్లేన్ మ్యాక్స్వెల్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ను మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించిన రాహుల్(0) స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసిన కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్ స్టీవ్ స్మిత్ వదిలేసాడు. ఈ అవకాశంతో చెలరేగిన కోహ్లీ దూకుడుగా ఆడాడు. మరోవైపు ధావన్ కూడా మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.

కోహ్లీ హాఫ్ సెంచరీ..
క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని స్వెప్సన్ విడదీశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్(21 బంతుల్లో 3 ఫోర్లతో 28)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అతని బౌలింగ్లో గబ్బర్ డిప్ మిడ్ వికెట్ మీదుగా పుల్ షాట్ ఆడగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఆడమ్ సామ్స్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. బంతి చేజారిన లెఫ్టాండ్తో ఒడిసి పట్టుకున్నాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక జంపా బౌలింగ్లో క్విక్ సింగిల్తో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ప్చ్.. సంజూ, అయ్యర్ మళ్లీ విఫలం..
ఆ వెంటనే స్వెప్సన్ ఒకే ఓవర్లో సంజూ శాంసన్(10), అయ్యర్(0)ను ఔట్ చేసి దెబ్బతీశాడు. శాంసన్ను క్యాచ్ ఔట్ చేయగా.. అయ్యర్ను వికెట్లు ముందు బోల్తాకొట్టించాడు. ఇక క్రీజులోకి వచ్చిన పాండ్యాతో కోహ్లీ జట్టును విజయం దిశగా నడిపించాడు. భారీ షాట్లు ఆడుతూ ఆశలు రేకెత్తించాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చిన హార్దిక్ పాండ్యా(20) జంపా బౌలింగ్లో ఫించ్కు చిక్కి వెనుదిరిగాడు. మరికొద్దిసేపటికే భారీ షాట్కు యత్నించిన విరాట్.. ఆడమ్ సామ్స్ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. ఆండ్రూ టై బౌలింగ్లో కోహ్లీ ఆడిన స్లైస్ షాట్ను సామ్స్ అద్భుత డైవ్తో అందుకున్నాడు. ఈ ఓవర్ చివరి బంతికి శార్ధుల్ భారీ సిక్సర్ కొట్టడంతో.. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. ఇక శార్ధుల్ మరో భారీ సిక్సర్తో ఆశలు రెకెత్తించినా చేధించే పరుగులు ఎక్కువగా ఉండటంతో భారత్ ఓటమి ఖాయమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications