చహల్ మాయ
భారత్ నిర్దేశించిన టార్గెట్ను ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్కు డీఆర్సీ షార్ట్ , ఫించ్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 56 పరుగులు జోడించిన తర్వాత ఫించ్ ఔటయ్యాడు. 8వ ఓవర్ నాల్గో బంతికి ఫించ్ను ఔట్ చేసిన చహల్..10వ ఓవర్ ఐదో బంతికి స్టీవ్ స్మిత్ (12) పెవిలియన్కు పంపి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. దాంతో ఆసీస్ 72 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. అనంతరం మ్యాక్స్వెల్ (2), డీఆర్సీ షార్ట్లను తన వేర్వేరు ఓవర్లలో నటరాజన్ ఔట్ చేయడంతో.. టీమిండియా రేసులోకి వచ్చింది.
చెలరేగిన నట్టూ
వేడ్ (7)ను చహల్ బోల్తా కొట్టించాడు. ఆ తరువాత హెన్రిక్స్ ఫర్వాలేదనిపించినా అతన్ని దీపక్ చహర్ ఔట్ చేశాడు. దాంతో ఆసీస్కు తిరిగి తేరుకోలేకపోయింది. సీన్ అబాట్ (12) వికెట్ పడకుండా ఆడినా.. నటరాజన్ బౌలింగ్లో స్టార్క్ బోల్ట్ అయ్యాడు. సూపర్ యార్కర్ సంధించి నట్టూ అతడిని పెవిలియన్ చేర్చాడు. స్పెప్సన్ (12), అబాట్ నాటౌట్గా నిలిచారు. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులే చేసి ఓటమి పాలైంది. మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది.
రాహుల్ హాఫ్ సెంచరీ
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1) త్వరగానే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (9)తో కలిసి కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించడంతో పవర్ప్లేలో భారత్ 42 పరుగులు సాధించింది. కాగా ఏడో ఓవర్లో కోహ్లీని స్పిన్నర్ స్వెప్సన్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన సంజు శాంసన్ (23; 15 బంతుల్లో, 1×4, 1×6)తో పాటు కేఎల్ రాహుల్ ధాటిగా ఆడటంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లాఫ్టెడ్ షాట్లతో వీరిద్దరు బౌండరీలు బాదారు. ఈ క్రంమలోనే రాహుల్ హాఫ్ సెంచరీ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) బాదాడు.
జడేజా విధ్వంసం
అయితే ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఆరు పరుగుల వ్యవధిలోనే శాంసన్, మనీష్ పాండే (2), కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో భారత్ 92 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా (16; 15 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయాడు. అయితే ఇన్నింగ్స్ చివరలో రవీంద్ర జడేజా (44; 23 బంతుల్లో, 5×4, 1×6) విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో భారత్ 46 పరుగులు పిండుకుంది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది.