

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఆప్ఘనిస్థాన్ ఓపెనర్ మహ్మద్ షెహజాద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో అడుగుపెట్టింది మొదలు మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలో టీ20 క్రికెట్ తరహాలో కళ్లుచెదిరే షాట్లు ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా ఓపెనర్ మహ్మద్ షెహజాద్ దూకుడుగా ఆడి సెంచరీ సాధించాడు.
ఈ క్రమంలో మహ్మద్ షెహజాద్ 88 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో మెరుపు సెంచరీ సాధించాడు. కెరీర్లో షెహజాద్కి ఇది 5వ సెంచరీ. మొత్తం జట్టు స్కోరులో ముప్పావు వంతు షెహజాద్ ఒక్కడే బాదడం విశేషం. ప్రస్తుతం 32 ఓవర్లకు గాను ఆప్ఘనిస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
క్రీజులో మహ్మద్ షెహజాద్(114), మహ్మద్ నబీ(3) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, కుల్దీప్ 2, చాహర్ ఒక వికెట్ తీశారు. భారత్ జట్టు ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకోవడంతో, నామమాత్రమైన ఈ మ్యాచ్ నుంచి అగ్రశ్రేణి బౌలర్లు భువనేశ్వర్, బుమ్రాలకి టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.
దీంతో.. తుది జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్, సిద్ధార్థ కౌల్తో పాటు ఖలీల్ అహ్మద్లు కూడా ఓపెనర్ షెహజాద్ని ఏమాత్రం నిలువరించలేకపోతున్నారు. 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షెహజాద్ ఇచ్చిన క్యాచ్ను అంబటి రాయుడు జారవిడిచాడు. దీంతో అతడు ఈ లైఫ్ని సద్వినియోగం చేసుకుని సెంచరీతో చెలరేగుతున్నాడు.
అంతకముందు దూకుడుగా ఆడే క్రమంలో ఆప్ఘనిస్థాన్ వరుసగా వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఆప్ఘనిస్థాన్ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ జావెద్ అహ్మది (5) పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 12.4వ బంతిని ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3) జడేజా బౌలింగ్లోనే బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హష్మతుల్లా షాహిది డకౌట్గా వెనుదిరగగా, కెప్టెన్ ఆస్గర్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరినీ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో పెవిలియన్కు పంపడం విశేషం.
ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి షాహిదీ.. మూడో బంతికి అస్గర్లను ఒక్క పరుగు కూడా చేయనీకుండానే పెవిలియన్కు చేర్చి ఆప్ఘన్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో ధోనీ రెండు సూపర్ స్టంపింగ్లతో అలరించాడు.