న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరగనున్న రెండో వన్డేలో కూడా అదే జోరుని కొనసాగించాలని యోచనలో టీమిండియా ఉంది.
ఈ నేపథ్యంలో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమండియా రికార్డు ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమిండియా ఆడిన వన్డేల్లో ఇప్పటి వరకు 12 వన్డేలు గెలవగా, ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఒక వన్డేలో ఫలితం తేలకపోగా మరొక వన్డే రద్దు అయింది.
కోట్లాలో టీమిండియా ఘనమైన విజయాలను నమోదు చేయడం గమనార్హం.
1987లో ఆస్ట్రేలియాపై 56 పరుగుల తేడాతో విజయం:
1983 వరల్డ్ కప్ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్లను కోల్పోయి 289 పరుగులు చేసింది. సునీల్ గవాస్కర్ (61), నవజ్యోత్ సింగ్ సిద్ధూ (51), దిలీప్ వెంగ్ సర్కార్ (83), మహమ్మద్ అజారుద్దీన్ (45 బంతుల్లో 54 నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు వేసిన అజారుద్దీన్ 18 పరుగులిచ్చి 3 వికెట్లను తీసుకుని భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
1994లో న్యూజిలాండ్పై 107 పరుగుల తేడాతో విజయం:
1994 నవంబర్లో విల్స్ వరల్డ్ సిరిస్లో భాగంగా ఆరో మ్యాచ్కి ఫిరోజ్ షా కోట్లా ఆతిథ్యమిచ్చింది. అజారుద్దీన్ కెప్టెన్గా ఉన్న ఈ మ్యాచ్లో భారత్ 289 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్లో 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అజయ్ జడేజా (90), సచిన్ టెండూల్కర్ (62), అజారుద్దీన్ (58 నాటౌట్) పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన న్యూజిలాండ్ 27 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. 45.4 ఓవర్లలోనే 182 పరుగులు చేసిన ఆలౌట్ అయింది.
1999లో న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో విజయం:
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ వన్డే సిరిస్లో ఇది చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో 3-2 తేడాతో సిరిస్ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 50 ఓవర్లు ఆడి 9 వికెట్లను కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత బౌలర్ టి కుమరన్ 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్ని భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 44 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్లో గంగూలీ 100 బంతుల్లో 86 పరుగులు చేశాడు.
2011లో ఇంగ్లాండ్పై 8 వికెట్ల తేడాతో విజయం:
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా రెండో మ్యాచ్కి ఫిరోజ్ షా కోట్లా మైదానం ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్లో ప్రస్తుత వన్డే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 112 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో వినయ్ కుమార్ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో మూడో వికెట్ భాగస్వామ్యానికి టీమిండియా 209 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో గంభీర్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
2014లో వెస్టిండిస్పై 48 పరుగుల తేడాతో విజయం:
ధోని నేతృత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగిన ధోని 40 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ ఆటగాళ్లలో డ్వేన్ స్మిత్ 97 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో షమీ 4 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా తలో మూడు వికెట్లు తీసుకున్నారు.