ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను మరింత విస్తరించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చేస్తోన్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ కామెంట్స్ చేశారు. క్రికెట్ ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందని, దీనికి కారణం.. అతి పెద్ద క్రికెట్ మార్కెట్గా ఆవిర్భవించడమేనని చెప్పారు.
గేమ్ సెట్ మ్యాచ్ పేరిట పాకిస్తాన్ టీవీ ఛానల్ సమా నిర్వహించిన ఓ టాక్షోలో షాహిద్ అఫ్రిది మాట్లాడారు. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించారు. క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ శాసించే స్థాయిలో భారత్ చేరిందని చెప్పారు. భారత్ ఏం చెబితే అదే.. జరుగుతుందని స్పష్టం చేశారు. భారత్ చెప్పిన విషయాన్ని క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయ టోర్నమెంట్లను కూడా వాయిదా వేసుకోవడమో.. రీషెడ్యూల్ చేసుకోవడమో జరుగుతోందని, క్రికెట్పై భారత్ సాధించిన ఆధిపత్యానికి అది నిదర్శనమని షాహిద్ అఫ్రిదీ పేర్కొన్నారు. ఐపీఎల్ వేలంపాటల్లో పాకిస్తాన్ క్రికెటర్లను పాల్గొనకపోవడానికీ కారణాన్ని వివరించారాయన. రాజకీయ పరంగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే కారణమని చెప్పారు.
పాకిస్తాన్ క్రికెటర్లు.. సుదీర్ఘకాలం పాటు ఐపీఎల్ వంటి టోర్నమెంట్లల్లో ఆడటానికి ఇష్టపడరనీ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ను ఆడటానికే మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. కాగా- ఐపీఎల్ టోర్నమెంట్ను మరింత విస్తరింపజేయడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇదివరకు ఎనిమిది జట్లకే పరిమితమైన ఈ టోర్నమెంట్ ఫ్రాంఛైజీల సంఖ్యను 10కి పెంచింది.
ఇదివరకు 60 వరకు మాత్రమే సాగే మ్యాచ్ల సంఖ్యనూ పెంచింది. 74కు తీసుకెళ్లింది. ప్రతి సంవత్సరం కూడా ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలనే అభిప్రాయంలో ఉంది బీసీసీఐ. దీనికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ప్రతిపాదనలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వద్దకు తీసుకెళ్లనుంది. అదే జరిగితే- ఇంటర్నేషనల్ మ్యాచ్ల సంఖ్య తగ్గుతుందని, క్రికెట్ ప్రపంచానికి అది మంచిది కాదని షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డారు.