ఆదిలోనే షాక్:
149 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే ఓపెనర్ లిటన్ దాస్ (7) వికెట్ కోల్పోయింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న నయీమ్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్ప్లే ముగిసేసరికి బంగ్లా 45 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ చహల్ తన తొలి ఓవర్లోనే నయీమ్ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
ఆదుకున్న సర్కార్:
అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి సర్కార్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ముష్ఫికర్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇక దూకుడుగా ఆడుతున్న సర్కార్ను ఖలీల్ బౌల్డ్ చేయడంతో బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లా (15 నాటౌట్) కలిసి జట్టును గెలుపు తీరాలకు చేరువ చేశారు.
ముష్ఫికర్ పోరాటం:
బంగ్లా విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో బౌండ్రీ వద్ద కృనాల్ క్యాచ్ వదిలేయడంతో ముష్ఫికర్ బతికిపోయాడు. ఆ ఓవర్లో బంగ్లా 13 పరుగులు పిండుకుంది. ఆ తర్వాత ఖలీల్ వేసిన ఓవర్లో ముష్ఫికర్ వరుసగా 4 ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. చివరి ఓవర్లో మహ్ముదుల్లా సిక్స్ కొట్టి బంగ్లాకు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది.
ఆదిలోనే షాక్:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ (9) వెనుదిరగడం భారత్ భారీ స్కోరు అవకాశాలను దెబ్బ తీసింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసినా.. అతని బ్యాటింగ్ ఏమాత్రం టీ20 స్థాయికి తగినట్లుగా సాగలేదు. ఇక వేగం పెంచే క్రమంలో రిషభ్ పంత్తో సమన్వయ లోపంతో పెవిలియన్ చేరాడు. లోకేశ్ రాహుల్ (15) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేదు.
కృనాల్, సుందర్ మెరుపులు:
కెరీర్లో తొలి మ్యాచ్ శివమ్ దూబే (1)కు కలిసి రాలేదు. కృనాల్ పాండ్యా (8 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), సుందర్ (5 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపుల కారణంగా చివరి 2 ఓవర్లలో భారత్ 30 పరుగులు రాబట్టింది. దీంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ముష్ఫికర్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గురువారం రాజ్కోట్లో జరుగనుంది.
వెయ్యవ టీ20:
ఆదివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టీ20 ఈ ఫార్మాట్లో వెయ్యవది కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో 2005 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరిగింది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో కూడా ఇప్పటికే వెయ్యి మ్యాచులు పూర్తయ్యాయి. వెయ్యవ టీ20లో బంగ్లా విజయం సాధించి చరిత్రలోకి ఎక్కింది.