తొలి టీ20పై అనుమానాలు:
అయితే తొలి టీ20 మ్యాచ్ నిర్వహణపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని బీసీసీఐ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 'తొలి టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి అయితే మ్యాచ్ను ఇంకా రద్దు చేయలేదు. మ్యాచ్పై తుది నిర్ణయం ప్రకటించడానికి ఇంకా సమయం ఉంది' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. రాత్రి సమయం కాబట్టి మంచు కూడా బాగా ఉందని సమాచారం.
ప్రమాదకర స్థితికి గాలి నాణ్యత:
ప్రస్తుతం డిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరుకుంది. సాయంత్రం 6.30 తర్వాత మ్యాచ్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా డిల్లీ విమానశ్రయానికి రావాల్సిన విమానాలను వేరే నగరాలకు దారి మళ్లించారు. మరోవైపు పొగమంచుతో మ్యాచ్కు వచ్చే అభిమానులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది. ఆటగాళ్లతో పాటు అభిమానులకు శ్వాసకు సంబందించి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.
దూబే అరంగేట్రం:
భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీతో జట్టు పగ్గాలు ఓపెనర్ రోహిత్ శర్మ తీసుకోనున్నాడు. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఆల్రౌండర్గా శివమ్ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్నాడు. రిషభ్ పంత్ను కూడా కొనసాగిస్తారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది.
కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా:
మరోవైపు కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్కు రెడీ అవుతోంది. ఐసీసీ బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబల్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు బలహీనపడింది. అయితే సీనియర్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దిక్ హుస్సేన్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. మ్యాచ్ జరిగితే తొలి టీ20లో బంగ్లా జట్టు ఎలా ఆడనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.