మూడో భారత క్రికెటర్గా:
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో మోత మోగించిన రోహిత్.. టెస్టుల్లోను తొలి ద్విశతకం నమోదు చేసాడు. దీంతో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారత క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఓవరాల్గా టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన నాల్గో క్రికెటర్గా గుర్తింపు పొందాడు. భారత్ తరఫున మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్లు మాత్రమే రెండు ఫార్మాట్లలో డబుల్ సెంచరీలు చేశారు. ఇక వెస్టిండీస్ భారీ హిట్టర్ క్రిస్ గేల్ టెస్టు, వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీలు చేసాడు. వీరి తర్వాత రోహిత్ ఉన్నాడు.
ఒక సిరీస్లో 500 పరుగులు:
ఇప్పటివరకూ ఈ సిరీస్లో రోహిత్ శర్మ 500కు పైగా పరుగులు సాధించాడు. దాంతో ఒక సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన ఐదో భారత ఓపెనర్గా అరుదైన ఘనతను నమోదు చేశాడు. అంతకుముందు వినోద్ మన్కడ్, బుద్ధి కుందిరేన్, సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్లు మాత్రమే ఒక టెస్టు సిరీస్లో 500లకు పైగా పరుగులు సాధించిన భారత ఓపెనర్లు కాగా.. ఇప్పుడు వారి సరసన రోహిత్ చేరాడు. తొలి టెస్టులోనే 303 పరుగులు సాధించిన రోహిత్.. రెండో టెస్టులో 14 పరుగులు చేశాడు.
తొలి ఇండియన్ క్రికెటర్:
రోహిత్ రెండో రోజు ఆటలో 150కి పైగా పరుగులు చేసి.. దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు తొలి ఇండియన్ క్రికెటర్గా కూడా రోహిత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన ఎనిమిదో క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. 2012-13 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. సఫారీలతో జరిగిన సిరీస్లో రెండు సార్లు 150కి పైగా పరుగులు సాధించాడు. అయితే క్లార్క్ మిడిల్ ఆర్డర్లో ఈ ఘనత సాధించాడు.
అత్యధిక సిక్సర్లు:
ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్గా కూడా రోహిత్ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్ కొట్టిన అనంతరం ఈ సిరీస్లో 16వ సిక్సర్ను రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ ఆటగాడు హెట్మెయిర్ 2018-19 సీజన్లో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో 15 సిక్సర్లు కొట్టాడు. భారత్ నుండి హర్భజన్ సింగ్ 14 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.