న్యూఢిల్లీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవ్వాళ మూడో వన్డే జరుగనుంది. ఢిల్లీ ఫిరోజ్షా కోట్లా అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం ఒంటిగంటకు టాస్ పడనుంది. మూడో వన్డేల సిరిస్లో ఇది చివరిది. సిరీస్ డిసైడర్ కావడం వల్ల ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశాలు లేకపోలేదు. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో గేమ్లో టీమిండియా గెలిచాయి. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మధ్యాహ్నం జరిగే చివరి వన్డే- సిరీస్ ఎవరిదనేది డిసైడ్ చేస్తుంది.
సిరీస్పై కన్నేయడం వల్ల టీమిండియా పెద్దగా ప్రయోగాలు చేయకపోవచ్చు. ఇప్పటికే గెలిచి ఉంటే చివరి వన్డే నామమాత్రంగా మిగిలేది. కొత్త ఆటగాళ్లను ఆడించడానికి అవకాశం లభించేది. ఇప్పుడా ఛాన్స్ లేదు. పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు కూడా. రంజీల్లో పరుగుల వరద పారించిన రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠికి నిరాశ తప్పకపోవచ్చు. టీమిండియా సెలెక్ట్ అయినా.. అరంగేట్రం చేయకుండానే వెనుదిరగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రెండో వన్డేలో భారీ స్కోరుతో కదం తొక్కిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ను పక్కన పెట్టి మరొకరిని తుదిజట్టులోకి తీసుకునే సాహసం చేయదు టీమిండియా మేనేజ్మెంట్. ఇషాన్ కిషన్ 84 బంతుల్లో 93, శ్రేయాస్ అయ్యర్ 113 పరుగులు చేశారు. సంజు శాంసన్ 30 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తొలి వన్డేలో సంజు శాంసన్ 86 పరుగులు చేసి సత్త చాటాడు. ఈ ముగ్గురు యంగ్ టర్క్లు ఇవ్వాళ్టి మ్యాచ్లో చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఢిల్లీలో ఆకాశం ఇవ్వాళ స్వల్పంగా మేఘావృతమై ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 27 డిగ్రీల వరకు నమోదవుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షం పడటానికి 38శాతం అవకాశం ఉంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో అడపాదడపా వర్షాలు కురుస్తోన్నాయి. ఇవ్వాళ వర్షం పడకపోవచ్చని ఐఎండీ పేర్కొంది. గాలిలో తేమ 86 శాతం వరకు నమోదవుతుంది. గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది.
మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు సహకరించే అవకాశం ఉన్నందున టాస్ గెలిస్తే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడానికే కేప్టెన్ శిఖర్ ధావన్ మొగ్గు చూపొచ్చు. సాధారణంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లకు ఇదో మంచి ట్రాక్. అవుట్ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల రెండో ఇన్నింగ్లో బౌలర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బంతిపై గ్రిప్ కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొనవచ్చు.