గాయంతో బుమ్రా..
ఇంకొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు టీమిండియా జైత్రయాత్ర సాగిస్తోండటం శుభపరిణామమే అయినప్పటికీ- అనుకోని అవాంతరం వచ్చి పడింది. బౌలింగ్ బ్యాక్బోన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు. ఈ సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్కూ దూరం అయ్యాడు. ఇది ఏ మాత్రం ఊహించని పరిణామమే. గాయం వల్ల స్టార్ పేసర్ దూరం కావడం- జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
ఊహించినట్టే..
ఊహించినట్టే- అతని స్థానంలో హైదరాబాద్కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు అవకాశం దక్కింది. అతని పేరును కొద్దిసేపటి కిందటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. బుమ్రా స్థానంలో సిరాజ్ను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20 మ్యాచ్లల్లో బుమ్రాకు బదులుగా సిరాజ్ ఆడనున్నట్లు తెలిపింది బీసీసీఐ. కోవిడ్ నుంచి కోలుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ- సిరాజ్ వైపే మొగ్గు చూపింది బోర్డ్.
నిరూపించుకుంటే..
ఈ సిరీస్లో గనక సిరాజ్ తన శక్తి సామర్థ్యాలేమిటో నిరూపించకోగలిగితే- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లోనూ అడుగు పెట్టడం ఖాయమౌతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్లతో పాటు పలు టీ20 ఇంటర్నేషనల్స్లోనూ ఆడిన అనుభవం ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్కు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని సిరాజ్ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. బుమ్రా స్థాయిని అందుకోగలిగితే- తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే అవుతుందతనికి.
కొత్త జట్టు ఇదే..
దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడటానికి ఎంపిక చేసిన జట్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసింది బీసీీసీఐ. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్తో కూడిన జట్టును ప్రకటించింది.