ముంబై: భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతోంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో ఇప్పటికే తొలి మ్యాచ్ను ముగించుకుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. గువాహటి దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. తిరువనంతపురం నుంచి ఈ రెండు జట్లు అస్సాం చేరుకున్నాయి.
ఈ సిరీస్ నుంచి టీమిండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకొన్న విషయం తెలిసిందే. వెన్నెముక ఫ్రాక్చర్తో అతను బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్కు అందుబాటులో ఉండట్లేదు. బ్యాక్ పెయిన్ ప్రభావం వల్ల వచ్చే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్కు కూడా దూరమౌతాడంటూ వార్తలొచ్చాయి. అనేక కథనాలు వెలువడ్డాయి. వెన్నెముక ఫ్రాక్చర్కు సర్జరీ చేయించుకోవాలనే ఉద్దేశంతో బుమ్రా ఉన్నాడని, సర్జరీ చేయించుకుంటే మాత్రం బెడ్ రెస్ట్ అవసరమౌతుందంటూ అంచనా వేశాయి.
కనీసం ఆరు నెలల పాటు బుమ్రా క్రికెట్కు దూరం కావాల్సిన పరిస్థితి రావొచ్చని పేర్కొన్నాయి. ఈ ఆరు నెలల వ్యవధిలో జరిగే ఏ సిరీస్కు కూడా ఈ స్టార్ పేస్ బౌలర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఎంత మాత్రం లేవని, స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానమేంటూ పేర్కొన్నాయి.
ఈ వార్తలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తాజాగా స్పందించింది. బుమ్రా గాయపడటం నిజమే అయినప్పటికీ- అతను టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి ఇంకా వైదొలగలేదని స్పష్టం చేసింది. బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ స్వయంగా దీన్ని ప్రకటించారు. బుమ్రా ఇంకా టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకోలేదని, ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని అన్నారు.
నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాతే బుమ్రా విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని సౌరవ్ గంగూలీ వివరించారు. దీనికి మించిన వివరాలు ఇవ్వడానికి గంగూలీ అంగీకరించలేదు. గాయం స్వభావంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తొలి టీ20 సందర్భంగా తిరువనంతపురంలో అతను స్కాన్ చేయించుకోగా.. వెన్నెముకలో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇటీవలే అతను బ్యాక్ పెయిన్ నుంచి కోలుకున్నాడు.