న్యూజిలాండ్దే పై చేయి..
ఇప్పటి వరకు జరిగిన ఆటను పరిశీలిస్తే న్యూజిలాండ్దే పైచేయి కనిపిస్తోంది. సెకండ్ డే ఆటలో కివీస్పై భారత్ ఎడ్జ్ సాధించినా.. మూడో రోజు ఆటలో మాత్రం విఫలమైంది. కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ బదులివ్వలేకపోయింది. ఆదివారం తొలి సెషన్లోనే భారత్ పతనం అంచున నిలిచింది.
చివరకు రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 5 ఫోర్లతో 49), కోహ్లీ (196 బంతుల్లో 1ఫోర్తో 44) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్కు చెరో వికెట్ దక్కింది.
భారత్ గెలవాలంటే..
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ గెలవాలంటే మాత్రం బౌలింగ్లో సత్తా చాటాల్సిందే. వర్షం అంతరాయం మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలను సూచిస్తున్నా.. పూర్తిగా బౌలింగ్కు అనుకూలమైన పిచ్పై రిజర్వ్ డేతో కలుపుకొని మరో రెండు రోజుల్లో ఫలితం తేలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా వాతావరణ శాఖ సైతం చివరి రెండు రోజులు వర్షాలు లేవని చెబుతుంది. కాబట్టి ఈ రెండు రోజుల పాటు ఆట పూర్తిగా సాగితే.. ఓ జట్టు చాంపియన్గా నిలవవచ్చు. ప్రస్తుతానికి న్యూజిలాండ్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తున్నప్పటికీ.. భారత్ అవకాశాలను కొట్టిపారేయేలేం.
బౌలర్లు చెలరేగితే..
ఎందుకంటే పిచ్, అక్కడి వాతావరణం అలా ఉంది. టీమిండియా సైతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 146/3తో మెరుగైన స్థితిలో నిలిచి ఉంది. పైగా క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్మెన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే ఉన్నారు. కానీ మూడో రోజు ఫస్ట్ సెషన్ ఆటలో అంతా రివర్స్ అయింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచుకున్న కివీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో 71 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆట అసాధ్యమని తేలింది కాబట్టి ఐదో రోజు ఆటలో భారత బౌలర్ల చెలరేగితో కివీస్ కూడా స్వల్ప స్కోర్కే పరిమితం కావచ్చు. ఇప్పటికే రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. తమ తప్పిదాలను సరిదిద్దుకొని వస్తే మ్యాచ్లో నిలవవచ్చు.
కేర్ ఫుల్గా ఆడాల్సిందే..
భారీ వర్షం తర్వాత పిచ్పై మాయిశ్చర్ ఉంటుంది. కాబట్టి పేసర్లకు మరింత అనుకూలించనుంది. ఐదో రోజు ఆటలో ఫస్ట్ సెషన్ లేదా సెకండ్ సెషన్ ఆరభంలో కివీస్ను ఆలౌట్ చేస్తే కోహ్లీసేనకు అవకాశాలుంటాయి. అయితే కివీస్కు ఏ మాత్రం లీడ్ ఇవ్వకుండా.. సెకండ్ ఇన్నింగ్స్లో కనీసం 250+ స్కోర్ చేయగలిగితే చివరిదైన ఆరో రోజు కివీస్పై ఒత్తిడి నెలకొల్పవచ్చు.
పైగా నాలుగో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో పాటు.. టార్గెట్ చేధించాలనే ఒత్తిడితో కివీస్ ఆటగాళ్లు వికెట్ల పారేసుకొవచ్చు. అలా జరిగితే మాత్రం భారత్ తొలి ఐసీసీ టైటిల్ నెగ్గినట్లే. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో భారత కేర్ఫుల్గా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది. మంచి లక్ష్యాన్ని ఉంచాలనే ఆతృతలో ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తే మాత్రం భారత కొంప మునుగుతుంది. చివరి రెండు రోజులు వర్షంతో సెషన్ల పాటు ఆట రద్దయితే మాత్రం మ్యాచ్ డ్రా అయ్యే చాన్స్ ఉంది.