హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా భారత్ మరికొద్ది గంటల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. టీమిండియాకు ఇది చావోరేవో మ్యాచ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే.. భారత్ సెమీస్ రేసులో ఉంటుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుండగా.. తుది జట్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. న్యూజిలాండ్తో కీలకమైన మ్యాచ్కి తుది జట్టులో మార్పులు చేస్తే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాకు ఓ విలువైన సూచన చేశాడు. భువనేశ్వర్ కుమార్కు బదులు శార్దూల్ ఠాకూర్ను తీసుకోవాలన్నాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచుకు ముందు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్లో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ఈ క్రమంలోనే ప్లేయింగ్ ఎలెవన్పై మాట్లాడుతూ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బదులుగా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. 'ఈ రోజటి మ్యాచ్ కోసం నేను శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేస్తాను. ఎందుకంటే శార్దూల్ బ్యాట్తో పరుగులు చేయగలడు.. శార్దూల్ తీసుకోవడం వల్ల బ్యాటింగ్ లైనప్ బలంగా మారుతుంది. భువీ అనుభవజ్ఞుడైన బౌలర్. కానీ బ్యాలెన్స్, ప్లేయింగ్ ఎలెవన్ కలయిక గురించి ఆలోచిస్తే.. భువీ కంటే శార్దూల్ను ఎంచుకుంటా' అని లక్ష్మణ్ వివరించాడు.
India vs New Zealand: ఒక్క స్థానం కోసం పోటీలో మూడు జట్లు.. అలా అయితేనే సెమీస్కు భారత్!!
భువనేశ్వర్ కుమార్కు టీ20 ప్రపంచకప్ 2021 చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ కావచ్చని వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. గత రెండు ఏళ్లలో భువీ పేస్ గణనీయంగా పడిపోయిందన్నాడు. ఇటీవలి కాలంలో తన పోటీదారు దీపక్ చహర్కి ఎక్కడా పోటీ ఇవ్వడం లేదని, అయినప్పుటికీ అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతందని భావించారని లక్ష్మణ్ చెప్పాడు. పాకిస్తాన్పై మూడు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చిన భువీ ఒక వికెట్ పడగొట్టలేదు. ఈ ఏడాది ప్రారంభంలో భువీ పునరాగమనం చేసినా.. అంతగా ఆకట్టుకోలేదు. చాలా మ్యాచులు ఆడినా 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అందులో ఒకే మ్యాచులో నాలుగు తీశాడు. ఐపీఎల్ 2021లో 11 మ్యాచులు ఆడి 6 వికెట్లు మాత్రమే తీశాడు. అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ 21 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఒక దానితో మరొకటి పోటీ పడలేదు. భారత్ ఆదివారం న్యూజిలాండ్తో తలపడనుంది. అఫ్గానిస్థాన్తో నవంబర్ 3న కోహ్లీసేన తలపడనుంది. నవంబర్ 7న కివీస్, అఫ్గాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మూడు మ్యాచుల అనంతరం సెమీస్ చేరే జట్లపై పూర్తి స్పష్టత రానుంది. భారత్ సెమీస్కు చేరాలంటే.. న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచుల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అలా అయితేనే కోహ్లీసేన సెమీస్కు చేరుకుంటుంది. ఒక మ్యాచ్ ఓడినా కోహ్లీసేన ఆశలు ఆవిరికానున్నాయి. అలా కాకుండా ఒకదానిపై గెలిచి.. మరో జట్టు చేతిలో ఓడితే మూడు జట్లు ఒక్కొక్కటి గెలిచినట్టు అవుతుంది. అప్పుడు నెట్ రన్రేట్పై ఆధారపడాల్సి వస్తుంది. సెమీస్కు ప్రధానంగా న్యూజిలాండ్, భారత్ ఫేవరెట్గా కనిపిస్తున్నా.. టాప్2లో నిలిచేందుకు తాము కూడా ఉన్నామని అద్భుత ప్రదర్శనతో అఫ్గాన్ ఇప్పటికే చాటిచెప్పింది.