|
బౌండరీలతో ఆకట్టుకున్న రాహుల్:
నాటింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజైన గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడారు. ఇంగ్లీష్ పేసర్లు పిచ్పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని చెలరేగినా.. భారత ఓపెనర్లు ఓపికగా ఆడారు. ఆరంభంలో పరుగులు చేయలేదు. క్రీజులో కుదురుకున్నాక స్ట్రైక్ రొటేట్ చేశారు. అనంతరం చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తూ.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. రాహుల్, రోహిత్ తమదైన శైలిలో బౌండరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ పేసర్లు అసహనానికి గురయ్యారు.
కోపంలో రాహుల్ కళ్లలోకి చూస్తూ:
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా.. 25వ ఓవర్ వేసిన ఒలీ రాబిన్సన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ ఓవర్ మొదటి బంతిని రాబిన్సన్ యార్కర్ రూపంలో సంధించాడు. రెండో బంతిని కూడా అలానే వేయగా.. రాహుల్ ప్యాడ్లను తాకింది. ఇంగ్లీష్ ఆటగాళ్లు అప్పీల్ చేసినా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూ తీసుకున్నా.. బంతిని వికెట్లకు పైన్నుంచి వెళ్లడంతో వారికి నిరాశే ఎదురైంది. మూడో బంతిని కూడా రాహుల్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. నాలుగో బంతికి టీమిండియా ఓపెనర్ ఫోర్ బాదడంతో.. రాబిన్సన్ అసహనానికి గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. ఆ కోపంలో రాహుల్ కళ్లలోకి చూస్తూ బౌలింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఇది సరదాగే జరిగినా.. నెట్టింట వైరల్ అయింది.
ఆటకు వర్షం అంతరాయం:
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట అర్ధాంతరంగా నిలిచిపోయింది. గురువారం రెండో సెషన్లో భారత్ 46.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఈ సమయంలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాసేపటికే మైదానంలో వర్షం కురవడంతో.. మ్యాచ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (57; 148 బంతుల్లో 9x4) అర్ధ శతకంతో కొనసాగుతుండగా.. రిషభ్ పంత్ 7 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరుకు భారత్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 58 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. వర్షం తగ్గే సూచనలు ఉండడంతో.. ఇరు జట్ల ఆటగాళ్లు ముందుగానే టీ బ్రేక్ తీసుకున్నారు. ఈ మ్యాచులో చేటేశ్వర్ పుజారా (4), విరాట్ కోహ్లీ (0), అజింక్య రహానే (5)లు పూర్తిగా నిరాశపరిచారు. ఈ త్రయం తర్వగా పెవిలియన్ చేరడంతో రాహుల్ పోరాడుతున్నాడు.