నాటింగ్హామ్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు రెండో సెషన్ పూర్తయింది. ఇంగ్లండ్ 70 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (96 నాటౌట్; 138 బంతుల్లో 13x4) సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం జాస్ బట్లర్ (15; 20 బంతుల్లో 3x4) అతడికి తోడుగా క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ 24 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. టీమిండియాపై ప్రస్తుతం ఇంగ్లండ్ 140 పరుగుల ఆధిక్యం సంపాదించింది. భోజన విరామానికి ముందు 40 ఓవర్లలో 119/2తో నిలిచిన ఇంగ్లండ్.. రెండో సెషన్లో మరో 116 పరుగులు జోడించి మూడు వికెట్లు కోల్పోయింది.
లంచ్ బ్రేక్ అనంతరం డామ్ సిబ్లీ (28; 133 బంతుల్లో 2x4) జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. తర్వాత జానీ బెయిర్స్టో (30; 50 బంతుల్లో 4x4)తో కలిసి జో రూట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. రూట్ నెమ్మదిగా ఆడగా.. బెయిర్స్టో కాస్త వేగంగా ఆడాడు. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ ఇంగ్లీష్ స్కోర్ బోర్డును ముందుకు కదిపాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో మొహ్మద్ సిరాజ్ బౌలింగ్లో రవీంద్ర జడేజాకు దొరికిపోయాడు. దాంతో ఇంగ్లాండ్ 177 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
ఆపై జో రూట్కు డానియెల్ లారెన్స్ (25; 32 బంతుల్లో 4x4) జతకలిశాడు. లారెన్స్ త్వరగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో క్రీజులోకి వచ్చాడు. వచ్చిరావడంతోనే భారత బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న లారెన్స్ను శార్ధూల్ ఠాకూర్ వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన రూట్, బట్లర్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్ను పూర్తి చేశారు. రెండో సెషన్లో ఇంగ్లండ్ 116 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆటకు పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో మూడు రోజుల ఆట పూర్తైంది. ఇక నాలుగో రోజు ఆటకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నా ఇప్పటివరకు ఆట సజావుగానే సాగింది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆపై భారత్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌట్ కావడంతో 95 పరుగుల ఆధిక్యం లభించింది.