హైదరాబాద్: వర్షం కారణంగా తొలి టెస్ట్లో విజయానికి దూరమైన టీమిండియా.. ఇంగ్లండ్తో కీలకమైన రెండో టెస్ట్కు రెడీ అయ్యింది. గురువారం (మధ్యాహ్నం 3.30 గంటల) నుంచి జరిగే ఈ మ్యాచ్లో మరింత మెరుగైన బ్యాటింగ్ షో చూపెట్టాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్నూ మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్పై ప్రస్తుతం భారత్దే పైచేయిగా కనిపిస్తోంది.
న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎదురైన పరాభావం నుంచి పాఠాలు నేర్చుకున్న కోహ్లీసేన తొలి టెస్ట్లో ఆ తప్పిదాలను సరిచేసుకుంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఫార్మూలతో ప్రత్యర్థిని దెబ్బతీసింది. ఇక విజయమే ఖాయం అనుకుంటున్న దశలో వరణుడు ఇంగ్లండ్ 12వ ప్లేయర్గా బరిలోకి దిగి అడ్డుకున్నాడు. జోరూట్ సేనను ఓటమి నుంచి గట్టెక్కించాడు. అయితే సొంతగడ్డపై లభించే అడ్వాంటేజ్తో జోరూట్ సేన జోరు కనబర్చాలని భావిస్తుండగా.. తొలి టెస్ట్లో చేసిన తప్పిదాలను సవరించుకొని విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజానివ్వనుంది.
అయితే ఈ సిరీస్ భారత ప్రసార హక్కులను సోనీ టీవీ సొంతం చేసుకుంది. సోనీ టీవీ 1, 2, 3, 4 చానెల్స్లో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఆ చానెల్కు సంబంధించిన ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ సోనీ లీవ్లో కూడా మ్యాచ్లు రానున్నాయి. అయితే వీటన్నింటికీ ప్రేక్షకులు డబ్బులు చెల్లించుకోవాల్సిందే. అయితే ఈ సిరీస్ను మెబైల్లో ఫ్రీగా చూడే అవకాశం కూడా ఉంది. జియో టీవీ యాప్తో పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా ఈ సిరీస్ను ఫ్రీగా వీక్షించవచ్చు. ఈ యాప్ల ద్వారా సోనీ టీవీకి సంబంధించిన అన్నీ చానెల్స్ను ఫ్రీగా చూడవచ్చు. నచ్చిన భాషలో ఆస్వాదించవచ్చు.
భారత తుది జట్టులో ఒక మార్పు అనివార్యమైంది. స్టార్ పేసర్ శార్దుల్ ఠాకూర్ తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అయితే తొలి టెస్ట్లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ స్ట్రాటజీ అద్భుత ఫలితం ఇవ్వడంతో.. ఇప్పుడు ఐదో బౌలర్గా స్పిన్నర్ అశ్విన్ను ఆడించాలా? లేక పేసర్లు ఇషాంత్, ఉమేశ్లో ఎవర్ని తీసుకోవాలి? అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. అయితే లోయరార్డర్ బ్యాటింగ్ను బలోపేతం చేయాలంటే కచ్చితంగా అశ్విన్కే చోటు దక్కుతుంది. గ్రీన్ టాప్ వికెట్ ఉంటే మాత్రం ఇషాంత్ తుది జట్టులోకి వస్తాడు.
అతని స్థానంలో మరో పేస్ బౌలర్ ఇషాంత్ లేదా ఉమేశ్ లకు అవకాశం ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ఒక ప్రత్యా మ్నాయం. అయితే ట్రెంట్బ్రిడ్జ్ మైదానంతో పోలిస్తే కొంత పొడిగా ఉండే లార్డ్స్ పిచ్ను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. పైగా కొంత బ్యాటింగ్ను బలంగా మార్చాలనే కారణంతోనే శార్దుల్కు తొలి టెస్టులో అవకాశం దక్కింది. అలా చూస్తే మంచి బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్న అశ్విన్వైపే మొగ్గు ఎక్కువగా ఉంది.
ఇక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్ తన చాన్స్ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. మరోవైపు భయపడినట్లుగానే భారత ప్రధాన బ్యాటింగ్ త్రయం పుజారా, కోహ్లీ, రహానే గత టెస్టులోనూ విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉండదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూ టీసీ) ఫైనల్లో విఫలమైన బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్లోకి రావడం భారత్కు కలిసొచ్చే అంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు. వీరికి అశ్విన్ పదునైన స్పిన్ జత కలిస్తే భారత్కు ఎదురుండదు.