|
అసలు సంగతేంటంటే..?
ఆసీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నటరాజన్ వేసిన నాలుగో బంతి జోరు మీదున్న మాథ్యూ వేడ్ ప్యాడ్లకు తాకింది. దాంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. ఈ సమయంలో లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బౌలర్కు దూరంగా ఉండటంతో రివ్యూ కోరడం ఆలస్యమైంది. క్లోజ్డ్ కాల్గా భావించిన విరాట్ రివ్యూ కోరాడు. కానీ అప్పటికే ఈ బాల్కు సంబంధించిన రిప్లే మైదానంలోని స్క్రీన్పై వచ్చేసింది. మాథ్యూ వేడ్ ఔట్ అనే విషయం స్పష్టంగా కనిపించింది. దాంతో ఫీల్డ్ అంపైర్లు విరాట్ రివ్యూను తిరస్కరించారు. దీనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. కానీ వారు తమ నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో చేసేదేమిలేక విరాట్ వెనక్కి తగ్గాడు.
|
టైమర్ ఇవ్వకుండా రీప్లే..
అయితే ఇక్కడ రివ్యూ తీసుకోవడానికి గల టైమర్ ఇవ్వకుండా రీప్లే ఎందుకిచ్చారనే ప్రశ్న తలెత్తుంది. మాజీ క్రికెట్లరు విశ్లేషకులు కూడా ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. రీప్లే వచ్చాక రివ్యూకు అంగీకరించవద్దని, కానీ అంత తర్వగా రీప్లే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అసలు నిర్ధిష్ట సమయం ముగిసిన తర్వాత రీప్లే ఇచ్చారా? లేక ముందే ఇచ్చారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ‘సరైన నిర్ణయం తీసుకున్నారు. బిగ్ స్క్రీన్లో రీప్లే వచ్చిన తర్వాత రివ్యూకు ఆస్కారం లేదు. కానీ ఈ రీప్లే నిర్థిష్ట సమయానికి ముందే వచ్చిందా? లేక 15 సెకండ్ల తర్వాత వచ్చిందా? అనేదే ప్రశ్న'అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
|
రివ్యూ తీసుకొని ఉంటే..
‘మాథ్యూ వేడ్కు వ్యతిరేకంగా వచ్చిన రిఫెరల్ ఆసక్తికర ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఒక వేళ్ల బిగ్ స్క్రీన్పై వచ్చిన రీప్లే రిఫరల్ నిర్థిష్ట టైమ్లో వస్తే రివ్యూను తిరస్కరిస్తారా? ఇలాంటి పరిస్థితుల్లో మనకు టైమ్ కావాలి. కానీ ఈ ప్రశ్న చాలా విలువైనది'అని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఇక భారత అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంపైర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రివ్యూను అంపైర్లు అంగీకరించి ఉంటే 50 పరుగుల వద్దే వేడ్ ఔటయ్యేవాడు. అలా బతికిపోయిన వేడ్ ఆ తర్వాత మరో 30 పరుగులు రాబట్టాడు. అంపైర్ల తప్పిదం వల్ల ఫలితమే మారిపోయిందని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లీ పోరాటం వృథా!
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 80), గ్లేన్ మ్యాక్స్వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సుంధర్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, ఠాకుర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులే చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 85) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ (3/23) భారత పతనాన్ని శాసించగా.. మ్యాక్స్వెల్, అబాట్, టై, జంపా తలో వికెట్ తీశారు.