ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు
"ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మేం విధించిన టార్గెట్ను చేధించడం కూడా అంత సులువు కాదు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మేం మ్యాచ్ను 18 ఓవర్లు వరకు తీసుకొచ్చాం. యువజట్టుగా మేం మానసికంగా ధృడపడాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో అనే దానిపై దృష్టిపెట్టుంటే.. ఇలాంటి మ్యాచ్లను సులువుగా మావైపు తిప్పుకునే వాళ్లం" అని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది.
ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని
గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగిన భారత జట్టుకు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాట్స్ఉమెన్స్లో స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్(26)లు మాత్రమే ఫరవాలేదనిపించారు.
రిజర్వ్ బెంచ్కే పరిమితమైన మిథాలీ రాజ్
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (16), కృష్ణమూర్తి (2), బాటియా (11)లు తీవ్రంగా నిరాశ పరిచారు. మరోవైపు ఈ మ్యాచ్కు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడం కూడా భారత్ ఓటమికి కారణమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆడుతూ పాడుతూ చేధించింది. ఇంగ్లాండ్ను ఇన్నింగ్స్లో రెండో ఓవర్లోనే రాధా యాదవ్ దెబ్బకొట్టింది.
భారత్ శిబిరంలో ఆశలు
ఒక పరుగు మాత్రమే చేసిన బ్యూమౌంట్ మిడాన్లో ఉన్న అరుందతీ రెడ్డి చేతికి చిక్కింది. తర్వాత క్రీజులోకి వచ్చిన డానీ వ్యాట్ కూడా ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటైంది. దీంతో భారత్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన నాటాలీ స్కివర్-అమీ అలెన్ జోన్స్ జోడీ మరో వికెట్ పడకుండా ఇంగ్లండ్కు విజయాన్ని అందించారు.
అమీ జోన్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
స్కివర్ (52), జోన్స్ (53) హాఫ్ సెంచరీలతో చెలరగడంతో పాటు మూడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో మరో 17 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ క్రికెటర్ అమీ జోన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంది. నవంబర్ 24న ఆంటిగ్వా వేదికగా ఫైనల్ జరగనుంది. ఫైనల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి.