ఆసీస్ను చిత్తుచేయడం అంత సులువు కాదు
లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం. అయితే ఫైనల్లో ఆసీస్ను చిత్తుచేయడం అంత సులువు కాదు. గత ఐదు సీజన్లలో వరుసగా ఫైనల్కు చేరి నాలుగు ట్రోఫీలను గెలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిందే. భారత్ సమిష్టిగా రాణిస్తేనే కప్ దక్కుతుందనేది వాస్తవం. అయితే కంగారూలను గెలిచే ముందే హర్మన్సేన భయాన్ని ముందు గెలవాలి.
షెఫాలీ విజృంభిస్తే
భారత్ విధ్వంసకర ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మతి మంధానలపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా షెఫాలీ వర్మపైనే. ఎందుకంటే.. ఇప్పటివరకు భారత్ సాధించిన ప్రతి విజయంలో ఆమెదే కీలక పాత్ర. ఆరంభం నుండే విరుచుకుపడుతూ.. బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ముఖ్యంగా పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియాకు విలువైన పరుగులు అందిస్తోంది. ఇక ఫైనల్లోనూ షెఫాలీ విజృంభిస్తే మ్యాచ్ మనం సగం గెలిచినట్టే.
బర్త్డే గర్ల్ హర్మన్ప్రీత్
మరో ఓపెనర్ స్మృతి మంధాన ఈ మెగా టోర్నీలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. మంధాన కూడా మెరిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ఈమ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఆదివారం 31వ పడిలోకి ఆమె అడుగుపెట్టనుంది. దీంతో తమ క్రికెట్ చరిత్రలోనే అద్భుత విజయంతో ఆ రోజును చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటోంది. అయితే ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హర్మన్ప్రీత్ ఈ కీలక మ్యాచ్లో తిరిగి బ్యాట్ ఝుళిపిస్తే విజయంపై నమ్మకంగా ఉండొచ్చు. ఇక జెమిమా రోడ్రిగ్స్ భారీ ఇన్నింగ్స్ భాకీ ఉంది.
పూనమ్పైనే ఆశలు:
ఈ మెగా టోర్నీలో భారత మహిళలు ఒక్కసారి కూడా 150 స్కోర్ చేయలేకపోయారు. అయినా జట్టు విజయాలు సాధించిందంటే అందుకు కారణం బౌలర్లు. స్పిన్నర్ పూనమ్ యాదవ్, పేసర్ శిఖ పాండే భారత విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పూనమ్ యాదవ్ అద్భుతంగా రాణిస్తోంది. ఫైనల్లో కూడా ఈమె చెలరేగితే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వార్డ్ తమ వంతు సాయం చేస్తున్నారు. భారత్ కప్ను ముద్దాడాలంటే ఫైనల్లో అందరూ సత్తాచాటాలి.
కీలక ప్లేయర్లు లేకున్నా పటిష్టంగానే ఆసీస్:
ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్పై ఆసీస్ విజయం సాధించింది. అయితే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లో మాత్రం మన చేతిలో ఓటమి చవిచూడటం ఆసీస్కు మింగుపడడంలేదు. ఇక గాయాలతో ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ, పేసర్ తాల్యా వ్లామ్నిక్ దూరమవ్వడం ఆసీస్కు పెద్ద ఎదురుదెబ్బ. ఇద్దరు కీలక ప్లేయర్లు లేకున్నా ఆసీస్ పటిష్టంగానే ఉంది. కెప్టెన్ మెగ్ లానింగ్, బెత్ మూనీ, ఎలీసా హీలీ, మెగాన్ షట్, జొనాసెన్ మెరిస్తే.. భారత్కు కష్టాలు తప్పకపోవచ్చు.
పిచ్ ఎక్కువగా బౌలింగ్కు అనుకూలం:
మెల్బోర్న్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలిస్తుంది. అయితే తొలుత బౌలర్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. ఆ తర్వాత బంతి బ్యాటుపైకి వస్తుంటుంది. మెగా టోర్నీలో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మూడు సార్లు, ఛేదనకు దిగిన జట్టు రెండు సార్లు విజయాలను అందుకున్నాయి. వర్షం ముప్పు దాదాపు లేదని సమాచారం. మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్, జియో లైవ్ ద్వారా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జట్టు:
భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాడ్, రీచా ఘోశ్, వేద కృష్ణమూర్తి, శిఖ పాండే, అరుంధతి రెడ్డి, పూజ వస్త్రాకర్, పూనమ్, రాధా యాదవ్.
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), ఎరిన్ బర్న్స్, నికోలా కేరీ, ఆష్లీ గాడ్నర్, రేచల్ హేన్స్, అలిసా హీలీ, జెస్ జొనాసెన్, డెలిసా కిమ్మిన్స్, సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అనాబెల్ సదర్లాండ్, తాల్యా వ్లామ్నిక్, జార్జియా హరెహామ్.