పీసీబీ వాదన తోసిపుచ్చిన వివాదాల కమిటీ
రెండు దేశాల బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, అందువల్ల తమకు 7 కోట్ల డాలర్ల (సుమారు రూ.445 కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. దీనిపై 2 దేశాల బోర్డుల వాదనలు విన్న తర్వాత పీసీబీ వాదనను వివాదాల కమిటీ తోసిపుచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది.
ప్రపోజల్ లెటర్ లాంటిదని వాదించిన బీసీసీఐ
ఈ తీర్పే ఫైనల్ అని, దీనిపై అప్పీల్ చేసే అవకాశం కూడా లేదని క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రధానంగా ఇరు జట్ల మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా రాసుకున్న ఎమ్ఓయూ.. ఒక ప్రపోజల్ లెటర్ లాంటిదని బీసీసీఐ వాదించింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఆడతామనే వాదనను బలంగా వినిపించింది.
రూ. 445 కోట్లను చెల్లించాల్సిన అవసర్లేదు
రెండు బోర్డుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడాల్సి ఉన్నా.. భారత ప్రభుత్వం తిరస్కరించడంతో బీసీసీఐకి మరో దారి లేకుండా పోయింది. ఒప్పందం ఉల్లంఘన కారణంగా తమకు జరిగిన నష్టాన్ని పరిహారంతో పూడ్చాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే పీసీబీ డిమాండ్ చేసిన రూ. 445 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఐసీసీ వివాదాల కమిటీ తీర్పు చెప్పింది.
2013లో చివరిసారి పాకిస్థాన్తో
అక్టోబర్ 1 నుంచి 3 మధ్య రెండు బోర్డులు తమ వాదనలు వినిపించాయి. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో రెండు బోర్డులు సమర్పించిన లిఖితపూర్వక నివేదికలను పరిశీలించిన తర్వాత పీసీబీ వాదనను కొట్టేస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2013లో చివరిసారి పాకిస్థాన్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఇక రెండు దేశాల మధ్య టెస్ట్ సిరీస్ అయితే 2007 తర్వాత మళ్లీ జరగలేదు.