అరంగేట్రంలోనే అదుర్స్
మెన్స్ క్రికెట్లో ప్రభాత్ జయసూర్యను జులై నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తొలి నెలలో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అతను గెలుచుకోవడం గమనార్హం. అతను శ్రీలంక తరఫున ప్రస్తుతం స్పిన్ హీరోగా చెలామణీ అవుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యంత గుర్తుండిపోయే అరంగేట్ర ప్రదర్శనను ప్రభాత్ జయసూర్య సొంతం చేసుకున్నాడు.
అతను గాలేలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక సమం చేయడంలో కీలక ప్రదర్శన కనబరిచాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో 6/118, 6/59 ప్రదర్శనతో చెలరేగాడు. జయసూర్య సంచలనాత్మక బౌలింగ్తో ఆస్ట్రేలియాపై శ్రీలంక ఇన్నింగ్స్ ప్లస్ 39పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఓటు వేసినందుకు ధన్యవాదాలు
ఇక అవార్డు సందర్భంగా ప్రభాత్ స్పందించాడు. ‘నేను ఈ అవార్డు రావడం పట్ల సంతోషిస్తున్నాను. నాకు ఓటు వేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా జీవితంలోనే అద్భుతమైన నెల. నేను టెస్ట్ అరంగేట్రం చేశాను. ఆస్ట్రేలియా, పాకిస్తాన్లతో ఆడిన టెస్ట్ సిరీస్లను సమం చేయడానికి నా జట్టుకు సహకరించే బౌలింగ్ చేశాను. నా ప్రయాణంలో నాకు తోడ్పాటు అందించిన అభిమానులు, సహచరులు, కోచ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు రావడం పట్ల నేను చాలా థ్రిల్ అవుతున్నాను' అని అతను చెప్పాడు.
మన రేణుకకు మిస్సయింది..
మహిళల క్రికెట్ విషయానికి వస్తే.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లాంబ్ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆమె సత్తా చాటింది. ఓపెనింగ్ మ్యాచ్లో తన తొలి వన్డే సెంచరీని చేసింది. అలాగే వరుసగా రెండు మ్యాచుల్లో 67, 65పరుగులతో రెండు హాఫ్ సెంచరీలు సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంలో కీలకంగా వ్యవహరించింది. ఇకపోతే భారత వుమెన్స్ క్రికెటర్.. మహిళ భువీ అయిన రేణుక సింగ్కు నిరాశే ఎదురైంది. భారత పేస్ దళంలో నిఖర్సైన స్వింగ్ పేసర్గా రేణుకా సింగ్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.