
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్నాడు. కోహ్లీ 871 పాయింట్లతో టాప్లో ఉన్నాడు. కోహ్లీ గత మార్చి నుంచి ఒక్క వన్డే ఆడకున్నా.. టాప్లో కొనసాగడం విశేషం. అయితే టీ20ల్లో మాత్రం కోహ్లీ (673) తొమ్మితో స్థానంలో నిలిచాడు. బుధవారం ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (855), పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ (829) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో విశేషంగా రాణించిన ఓపెనర్ బెయిర్స్టో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్తో ఆఖరిదైన మూడో వన్డేలో బెయిర్స్టో 126 బంతుల్లో 112 పరుగులు చేసి రేటింగ్ పాయింట్లు అమాంతం పెంచుకున్నాడు. 30 ఏళ్ల బెయిర్స్టో 2018 అక్టోబర్లో తొలిసారి తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
వన్డే బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (722) నంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా (719) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (701), క్రిస్ వోక్స్ (675), కాగిసో రబాడ (665) టాప్-5లో ఉన్నారు. ఇక టాప్-10లో బుమ్రా తప్ప.. ఏ ఒక్క బౌలర్ కూడా లేడు.
ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (246) ఎనిమిదో ర్యాంకులో ఉన్నాడు. అఫ్గనిస్థాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 301 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. క్రిస్ వోక్స్ (281), ఇమాద్ వసీం (278), బెన్ స్టోక్స్ (276) టాప్-5లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు ఎవరూ టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయారు.