ముంబై: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బలపడాలంటే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చైర్మన్ పదవిలో ఉండాల్సిందే అని బీసీసీఐ ప్రస్తుత కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్గా సేవలందించిన గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బుధవారం దాదా 48 వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పలువురు క్రికెటర్లు, మాజీలు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా అరుణ్ ధుమాల్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకొన్నారు.
ప్రస్తుత తరుణంలో ఐసీసీ బలపడాలంటే సౌరవ్ గంగూలీ లాంటి వ్యక్తులను ఐసీసీ బాస్గా తీసుకురావాలని అరుణ్ ధుమాల్ ఆకాంక్షించారు. 'బీసీసీఐలో యువ రక్తాన్ని తీసుకొచ్చిన గంగూలీ.. ఐసీసీలో కూడా కొత్త ముఖాలను తీసుకొచ్చి అంతర్జాతీయంగా క్రికెట్ అభ్యున్నతికి పాటుపడగలరు. గత అక్టోబర్ నెలలోనే బీసీసీఐ కోశాధికారిగా బాధ్యతలు తీసుకొన్న నాకు.. దాదాతో కేవలం 9 నెలల అనుబంధమే ఉంది. అయినప్పటికీ ఆయనను ఎంతో చదివాను' అని ధుమాల్ అన్నారు.
'కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐసీసీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలోనే ఐసీసీ పైకి తీసుకురావడానికి దాదా లాంటి వ్యక్తులు ఎంతో అవసరం. గంగూలీనీ ఐసీసీ అధ్యక్షుడిగా నిలిపేందుకు బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనా దాదానే అధ్యక్ష పదవికి అర్హుడు' అని అరుణ్ ధుమాల్ చెప్పారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం ఈ నెలతోనే ముగియనున్నది.
ఐసీసీ చైర్మన్గా వ్యవహరించిన 62 ఏళ్ల శశాంక్ మనోహర్ పదవీకాలం ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా ఉన్న ఇమ్రాన్ ఖవాజ తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాగపూర్కు చెందిన న్యాయవాది మనోహర్ 2015 నవంబర్లో ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన రెండు సార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2011 వరకు.. ఆ తర్వాత 2015 అక్టోబర్ నుంచి 2016 మే దాకా రెండోసారి బీసీసీఐ పదవిలో కొనసాగారు.
ఐసీసీ నూతన చైర్మన్గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ప్రధాన పోటీదారులుగా ఉండే అవకాశం ఉంది. ఇక వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్, న్యూజిలాండ్ నుంచి గ్రెగర్ బార్క్లే, దక్షిణాఫ్రికా తరఫున క్రిస్ నెన్జాని కూడా చైర్మన్ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా మూడోసారి ఓ వ్యక్తి చైర్మన్ పదవి చేపట్టవచ్చు. దీంతో ఇప్పటికే రెండు పర్యాయాలు పూర్తి చేసుకోవడంతో మరోసారి ఆ పదవికి పోటీపడేందుకు శశాంక్ మనోహర్కు కూడా అవకాశముంది. కానీ మరోసారి పదవి స్వీకరించేందుకు అతను ఆసక్తి చూపలేదు.
'కేవలం 1400 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. కోహ్లీ భయ్యా ప్లీజ్ బిర్యానీ పంపించు'