తడబడుతూ :
339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్ అంబ్రిస్ (5), షైహోప్ (5) మలింగకు దొరికిపోయారు. మరో ఓపెనర్ గేల్ (48 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా త్వరగానే ఔటయ్యాడు. హెట్మైర్ (38 బంతుల్లో 29; 2 ఫోర్లు) పెవిలియన్ చేరడంతో 84 పరుగులకే 4 కీలక వికెట్లను విండీస్ కోల్పోయింది.
పూరన్ మెరుపు సెంచరీ:
ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ వేగంగా ఆడటం మొదలుపెట్టాడు. అతనికి కెప్టెన్ హోల్డర్ (26; 4 ఫోర్లు) తోడయ్యాడు. ఇద్దరు ఐదో వికెట్కు 61 పరుగులు జోడించాక హోల్డర్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్రాత్వైట్ (8) రనౌటయ్యాడు. అలెన్ వచ్చాక పూరన్ మరింత రెచ్చిపోయాడు. ఈ సమయంలో ధాటిగా ఆడుతున్న అలెన్ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌటయ్యాడు. తర్వాత 92 బంతుల్లో సెంచరీ (118; 103 బంతుల్లో 11×4, 4×6) చేసుకున్న పూరన్ నిష్క్రమించడంతో ఓటమి ఖాయమైంది. వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసి ఓడింది.
వికెట్కు 91 పరుగులు:
మొదట బ్యాటింగ్ చేసిన లంక 6 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నె (32), కుశాల్ పెరీరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 91 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. కరుణరత్నెను హోల్డర్ క్యాచ్ అవుట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అవిష్క ఫెర్నాండో బ్యాటింగ్తో అలరించాడు.
అవిష్క సెంచరీ:
అయితే కుశాల్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అవిష్క (103 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్సర్లు).. కుశాల్ మెండిస్ (39)తో కలసి స్కోరు బోర్డును నడిపించాడు. మెండిస్ను రిటర్న్ క్యాచ్తో అవుట్ చేసిన అలెన్.. మూడో వికెట్కు 85 రన్స్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఈ దశలో అవిష్క.. ఏంజెలో మాథ్యూస్ (26), లాహిరు తిరుమన్నె (33 బంతుల్లో 45 నాటౌట్)తో కలసి 58, 67 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఈ టోర్నీలో లంక తొలిసారి 300 పరుగుల మార్క్ దాటింది. 46వ ఓవర్లో కెరీర్ తొలి సెంచరీ పూర్తి చేసిన ఫెర్నాండోను తర్వాతి ఓవర్లో కాట్రెల్ క్యాచ్ అవుట్ చేశాడు. లంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.