పటిష్ట బ్యాటింగ్:
తొలి మ్యాచ్తోనే బోణీ చేయాలనుకుంటున్న భారత్.. టాప్ తుది జట్టుతో బరిలోకి దిగనుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో విఫలమయిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఫామ్ చాటుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరు కుదురుకుంటే పరుగుల వరద ఖాయమే. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వామప్ మ్యాచ్లో సెంచరీ చేయడంతో.. నాలుగో నెంబర్లో కేఎల్ రాహుల్ తన స్థానాన్ని ఖాయం చేసుకున్నట్టే. ఐదో స్థానంలో ధోనీ.. ఆరో స్థానంలో జాదవ్ వస్తారు. ధోనీ, జాదవ్, పాండ్యాలతో మిడిలార్డర్ బలంగా ఉంది.
భువనేశ్వర్ ఆడే అవకాశం:
బౌలింగ్లోనూ పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. సౌతాంప్టన్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. అయితే ఈ రోజు ఆకాశం మబ్బులతో ఉండే అవకాశం ఉంది. దీంతో షమీకి బదులుగా భువనేశ్వర్ను తీసుకోవచ్చు. లోయరార్డర్లో అతడు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక పేసర్ బుమ్రా జట్టు బౌలింగ్కు ప్రధాన బలం. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ లేదా చాహల్లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. వామప్ మ్యాచ్ల్లో ఆల్రౌండ్ షో కనబర్చిన జడేజాను తుది జట్టులోకి రానున్నాడు. జడేజా, భువీలు ఉంటే భారత బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారనుంది.
బ్యాట్స్మన్ తడబాటు:
తొలి మ్యాచ్లో విఫలమైన సఫారీ బ్యాట్స్మెన్.. రెండో మ్యాచ్లో తేరుకున్నారు. అయినా వరుసగా రెండు ఓటములతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసం దెబ్బతింది. ఈ సమయంలో సఫారీ ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఉంది. డికాక్, డుస్సెన్, డుప్లెసిస్లు ఫామ్లో ఉండడం దక్షిణాఫ్రికా జట్టుకు సానుకూలాంశం. ఓపెనర్ ఆమ్లా గాయం నుంచి కోలుకోవడం వారికి ఊరటనిచ్చే విషయం. మార్క్రమ్, డుమినీ, మిల్లర్ మిడిల్ఆర్డర్ లో ఉన్నా.. పరుగులు చేయడంలో విఫలం అవుతున్నారు. డుమినీ, మిల్లర్ ఆదుకుంటే సఫారీలకు తిరుగుండదు.
గాయాల బెడద:
పటిష్ట బౌలింగ్ వనరులతో బరిలో దిగిన సఫారీ జట్టు.. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థి జట్లకు 300 పైచిలుకు స్కోర్లను సమర్పించుకుంది. ఇక ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఎన్గిడి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో పేసర్ రబాడపైనే ఇప్పుడు జట్టు ఆధారపడి ఉంది. లెగ్ స్పిన్నర్ తాహిర్ జట్టుకు అండగా నిలవనున్నాడు. ఫెలుక్వాయో, మోరిస్ లు రబాడకు సహకారం అందించనున్నారు.
ముఖాముఖి రికార్డు:
ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్ల్లో గెలుపొందగా.. దక్షిణాఫ్రికా 46 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్లో నాలుగు సార్లు తలపడగా.. భారత్ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు ప్రొటీస్ విజయం సాధించింది.
పిచ్, వాతావరణం
వర్షం కారణంగా మంగళవారం పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. పచ్చికను పూర్తిగా తొలగించారు. ఇక వర్షం కారణంగా భారత నెట్ ప్రాక్టీస్ సెషన్కు అంతరాయం కలిగింది. పిచ్ బ్యాటింగ్కు సహకరించే వీలుంది. బుధవారం వర్షం కురిసే అవకాశం తక్కువే. అయితే చల్లని వాతావరణం మ్యాచ్పై ప్రభావం చూపొచ్చు.
భారత్
శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్/మొహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహల్/రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ, జస్ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా:
ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్ (కెప్టెన్), డసెన్, మార్క్రమ్, మిల్లర్, డుమిని, మోరిస్, ఫెలుక్వాయో, తాహిర్, రబడ.