టీమిండియా ప్రదర్శనపై డయానా ఎడుల్జి
టీమిండియా ప్రదర్శనపై సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జి పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "టీమ్ అద్భుత ప్రదర్శన చేసింది. అనుకోకుండా మ్యాచ్ రెండో రోజు కూడా కొనసాగింది. మ్యాచ్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం జట్టుని ఒత్తడిలోకి నెట్టింది. అయినా జడేజా, ధోని జట్టుని మళ్లీ రేసులోకి తీసుకొచ్చారు. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన ధోని, జడేజాకు హ్యాట్సాప్" అని ఆమె అన్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 3 బంతులు మిగిలుండగానే 221 పరుగులకే కుప్పకూలింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా(77)తో కలిసి ఏడో వికెట్కు ధోని 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
నాకౌట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి
నాకౌట్ మ్యాచ్లో టీమిండియా ఓటమితో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై డయానా ఎడుల్జి మాట్లాడుతూ "ఈ టోర్నీలో ధోని ఆటతీరుని నేను అభినందిస్తున్నాను. ఇక, రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. అతడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోగలడు. అందుకు అతడు తన శరీరం నుంచి సమాధానం తీసుకోవాలి" అని ఆమె అన్నారు.
ధోనిలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది
"ఇప్పటికీ ధోనిలో ఎంతో క్రికెట్ దాగుందని నేను భావిస్తున్నాను. జట్టులోని యువ ఆటగాళ్లకు అతడి మెంటార్షిప్ అవసరం" అని ఆమె పేర్కొన్నారు. ఇక, టీమిండియా తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడుతూ "నిజానికి అదొక కఠినమైన మ్యాచ్, జట్టు మాత్రం అద్భుతంగా ఆడింది. ఎవరూ ఓడిపోవాలని అనుకోరు. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా పోరాడారు. అయితే, ఆరోజు మనది కాదు" అని అన్నాడు.