ఇప్పటికీ బుల్లెట్ బంతులే:
బ్యాట్స్మన్ 40 ఏళ్ల వయస్సులో కూడా బ్యాటింగ్ చేయొచ్చు. కానీ బౌలర్ మాత్రం 35 ఏళ్లు వచ్చాయంటే నెగ్గుకురావడం చాలా కష్టం. ఈ ఆగస్టు వస్తే మలింగకు 36 ఏళ్లు వస్తాయి. ఇంత వయసులో కూడా మలింగ బుల్లెట్ బంతులేస్తున్నాడు. 140, 130 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలుగుతున్నాడు. ఇక జట్టుకు అవసరమయిన సందర్భాల్లో కీలక వికెట్లు తీస్తున్నాడు. ఈ ప్రపంచకప్లో 12 వికెట్లు తీసాడు. అయితే జట్టు విఫలమవడంతో లంక టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ రోజు టీమిండియాతో లంక చివరి మ్యాచ్ ఆడుతోంది. ఐపీఎల్-12లో మేటి ఆటగాడు షేన్ వాట్సన్ను ఔట్ చేసి ముంబైకి ట్రోఫీని అందించాడు.
టీ20 ప్రపంచకప్లో ఆడుతా:
వన్డే ఫార్మాట్ నుండి ఎప్పుడు తప్పుకుంటాడో తెలియదు కానీ.. వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు మలింగ ఆడనున్నాడు. అయితే లంక మొదటగా ఆ టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది. లంక తరపున 97 టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసాడు. ఇక అన్ని టీ20లలో 378 వికెట్లు తీసాడు. '2020 టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్ ఆడాలి. టీ20 ప్రపంచకప్లో ఆడటం మాకు చాలా కీలకం. నేను టీ20 ప్రపంచకప్ ఆడటానికి ఎదురుచూస్తున్నా. నా వన్డే కెరీర్ గురుంచి లంక బోర్డును కలవకుండా ఏ నిర్ణయం తీసుకోలేను' అని తాజాగా మలింగ తెలిపాడు.
నాలుగు బంతులు.. నాలుగు వికెట్లు:
కరీబియన్ దీవుల్లో జరిగిన 2007 ప్రపంచకప్లో మలింగ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మలింగ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచకప్లో శ్రీలంక తరపున హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జార్జ్ టౌన్లోని ప్రావిడెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మలింగ బుల్లెట్ బంతులకు షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్ కలిస్, మఖయా ఎన్తిని వరుసగా పెవిలియన్ చేరారు.
రెండో ప్రపంచకప్ హ్యాట్రిక్:
ఆసియా ఉపఖండం ఆతిథ్యం ఇచ్చిన 2011 ప్రపంచకప్లో మలింగ రెండో ప్రపంచకప్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో కెన్యాతో జరిగిన మ్యాచ్లో మలింగ దాటికి తన్మయ్ మిశ్రా, పీటర్ ఒంగాండో, షెమ్ ఎంగోచి వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా లసిత్ మలింత అరుదైన ఘనత సాధించాడు.
సహచర ఆటగాళ్లకు ప్రోత్సహం:
మలింగ సహచర ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటాడు. అది లంక ఆటగాడు అయినా.. ఏ దేశ ఆటగాడైనా ఒకేవిధంగా ఉంటుంది. అందుకు తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. 'ధోనీ ఏడాది నుంచి రెండేళ్లు వరకు క్రికెట్ ఆడాలి. గత పది సంవత్సరాల నుంచి అతడే అత్యుత్తమ ఫినిషర్. నాకు తెలిసి అతన్ని ఎవరూ అధిగమించలేరు. తన అనుభవాన్ని యువ క్రికెటర్లకు నేర్పించాలి. అతడు కెప్టెన్సీ చేసిన కాలంలో జట్టు ఎంతో నేర్చుకుంది. అందుకే భారత్ మరింత బలమైన జట్టుగా మారింది. ఏ జట్టునైనా ఓడించే శక్తి టీమిండియాకు ఉంది' అని తెలిపాడు.