టోర్నీకి దూరం:
ఆస్ట్రేలియాతో మ్యాచ్లో.. ఆసీస్ పేసర్ కౌల్టర్నైల్ వేసిన బంతి ధావన్ చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడుతూ కూడా ధావన్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే 109 బంతుల్లో 117 పరుగులు చేసి.. భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నొప్పి కారణంగా ధావన్ వేలు వాచింది. దీంతో ఆసీస్ మ్యాచ్లో అతను ఫీల్డింగ్ చేయలేదు. ధావన్ స్థానంలో మ్యాచ్ మొత్తం రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. మంగళవారం స్కానింగ్ చేయించిన అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతనికి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ధావన్ ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు.
నాలుగో స్థానంలో ఎవరు:
ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్కు వచ్చే అవకాశం ఉంది. ఇక నాలుగో స్థానం రేసులో విజయ్ శంకర్, దినేష్ కార్తీక్ పోటీలో ఉన్నారు. మరి జట్టు యాజమాన్యం ఎవరికీ ఓటు వేస్తుందో చూడాలి. అయితే ధావన్ స్థానంలో యువ ఆటగాడు రిషభ్ పంత్కు చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అంబటి రాయుడు కూడా రేసులో ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఒకరు ఇంగ్లాండ్ పయనం కానున్నారు. నాలుగో స్థానం రేసులో వీరు కూడా ఉన్నారు. టీమిండియా గురువారం న్యూజిలాండ్తో తలపడనుంది. ఆ మ్యాచ్తో ఓపెనింగ్, నాలుగో స్థానంపై స్పష్టత రానుంది.
టీమిండియాకు పెద్ద లోటే:
ఐసీసీ టోర్నీలంచే ధావన్ ఆట తీరే పూర్తిగా మారిపోతుంది. అంతకముందు వరకు ఫామ్లో లేకున్నా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం అనూహ్యంగా చెలరేగిపోతాడు. 2015 ప్రపంచకప్తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో ధావన్ చెలరేగి ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో సఫారీలతో జరిగిన తొలి మ్యాచ్లో నిరాశ పరిచిన ధావన్.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో ధావన్కి ఇది 6వ సెంచరీ. ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో ఇప్పటివరకు మొత్తం 20 మ్యాచ్లాడిన ధావన్.. 65.15 యావరేజితో 1238 పరుగులు చేశాడు. తాజా సెంచరీతో ఐసీసీ టోర్నమెంట్లలో కుమార సంగక్కర, రికీ పాంటింగ్లతో సమానంగా ధావన్ ఆరు శతకాలు సాధించాడు. సచిన్, సౌరభ్ గంగూలీ ఏడు శతకాలతో ముందున్నారు. ఇంత రికార్డు ఉన్న ధావన్ టోర్నీకి దూరమవడం టీమిండియాకు పెద్ద లోటే.