
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొట్టిన బంతికి నెట్ బౌలర్ గాయపడ్డాడు. ప్రపంచకప్లో భాగంగా ఆదివారం లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరుగనుంది. రెండు ఫెవరేట్ జట్ల మధ్య మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత్, ఆస్ట్రేలియాలకు ఈ మ్యాచ్ చాలా కీలకం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివారం ఓవల్ మైదానంలోని నెట్స్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సన్నద్ధమవుతున్నాడు. అయితే ప్రాక్టీస్ చేస్తుండగా.. వార్నర్ కొట్టిన బంతి భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫాస్ట్ బౌలర్ (నెట్ బౌలర్) జై కిషన్ తలకు బలంగా తాకింది. దీంతో కిషన్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
వెంటనే కిషన్కు ఆస్ట్రేలియా సహాయక బృందంతో పాటు మైదానం సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి మెరుగైన చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం కిషన్ బాగానే ఉన్నాడని సమాచారం తెలుస్తోంది. నెట్స్లో జరిగిన ఘటనతో ఆసీస్ జట్టు సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ భయాందోళనకు గురయ్యాడట.
మరికొద్ది సేపట్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 136 వన్డేలు జరగ్గా.. భారత్ 49, ఆస్ట్రేలియా 77 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్లో పదకొండు మ్యాచ్లకు గాను భారత్ మూడింట్లో, ఆసీస్ ఎనిమిది మ్యాచ్ల్లో గెలుపుపొందింది. చివరగా ఇరు జట్లు 2015 ప్రపంచకప్ సెమిస్ లో తలపడగా.. ఆసిస్ గెలిచింది. చివరి ఐదు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. భారత్ తన చివరి 5 వన్డేల్లో రెండే గెలిచింది.