పది నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు చాలా పటిష్ఠంగా ఉందని ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది నిషేధం అనంతరం డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లు ఇటీవలే తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ఇద్దరి రాకతో ఆసీస్ బలం పెరిగింది. ఐపీఎల్-12లో సత్తా చాటిన ఈ ఇద్దరు.. ఇంగ్లాండ్తో జరిగిన ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచులో కూడా రాణించారు. వార్నర్ 43 చేయగా.. స్మిత్ సెంచరీ (116) చేసాడు. దీంతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
శ్రీలంకతో జరిగిన రెండో వార్మప్ మ్యాచులో వార్నర్, స్మిత్లు రెస్ట్ తీసుకున్నారు. ఖవాజా (89) పరుగులు చేయడంతో ఆసీస్ సునాయాస విజయాన్ని అందుకుంది. స్టార్ బౌలర్లు కూడా స్టార్క్, కమ్మిన్స్, రిచర్డ్ సన్, జంపాలు రాణించారు. రెండు వార్మప్ మ్యాచులలో గెలిచిన ఏకైక జట్టు ఆసీస్ మాత్రమే. దీంతో ప్రపంచకప్కు ముందు ఆసీస్ బాగానే సన్నద్ధమైంది.
తాజాగా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ... 'పది నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు చాలా పటిష్ఠంగా ఉంది. ఆటగాళ్లు నిలకడగా రాణిస్తూ.. వారి పాత్రలను పోషిస్తున్నారు. అందరూ ఫామ్ లో ఉండడం మాకు కలిసొచ్చే అంశం. మే 1 నుంచి ఒక జట్టుగా కలిసికట్టుగా ఆడుతున్నాం. మేము ఇంకా కొన్ని అంశాల్లో పటిష్ఠం అవుతున్నాం. ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన ఇస్తాం' అని ఫించ్ తెలిపాడు.