దక్షిణాఫ్రికాకు రెండో ఓటమి.. ప్రపంచకప్లో బంగ్లాదేశ్ బోణీ

ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో ఓటమి చవిచూడగా.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన బంగ్లాదేశ్ సమిష్టిగా రాణించి ఘనమైన బోణీ కొట్టింది. ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. సఫారీలు తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభావం మరిచిపోకముందే.. బంగ్లా చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. తొలి మ్యాచ్లోనే అద్భుత ఆటతో ఆగ్రశ్రేణి జట్లకు బంగ్లా హెచ్చరికలు జారీ చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

డుప్లెసిస్ మార్క్:
భారీ లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డికాక్ (23; 32 బంతుల్లో 4x4), మార్క్రమ్ (45; 56 బంతుల్లో 4x4) మంచి శుభారంభం ఇచ్చారు. అయితే సమన్వయ లోపంతో డికాక్ రనౌట్గా అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ (62; 53 బంతుల్లో 5x4, 1x6) తన మార్క్ ఆటతో ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో అర్ధ శతకం సాధించాడు. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరారు.

డుమిని పోరాడినా:
ఈ సమయంలో క్రిజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (38; 43 బంతుల్లో 2x4), డుస్సెన్ (41; 38 బంతుల్లో 2x4,1x6) నిలకడగా ఆడి స్కోర్ బోర్డుని పరిగెత్తించారు. అయితే బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. చేయాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో.. డుమిని చివర్లో ధాటిగా ఆడేందుకు యత్నించి 48వ ఓవర్లో అవుటవడంతో సఫారీల ఓటమి ఖాయమైంది. చివరకు సఫారీ జట్టు 309 పరుగులకు పరిమితమైంది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు, సైఫుద్దీన్ రెండు వికెట్లు తీశారు.

చెలరేగిన సౌమ్య సర్కార్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 330 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బంగ్లా ఇన్నింగ్స్ను ఓపెనర్లు తమిమ్ ఇక్బాల్ (16; 29 బంతుల్లో 2x4), సౌమ్య సర్కార్ (42; 30 బంతుల్లో 9x4)లు ఆరంభించారు. ముఖ్యంగా సౌమ్య తన మార్క్ బ్యాటింగ్ చూపించాడు. ఈ జోడి తొలి వికెట్కు 60 పరుగులు జోడించాక ఇక్బాల్ (16) ఔటయ్యాడు. అనంతరం మరో 15 పరుగులు జోడించాక వికెట్ కీపర్ డీకాక్ ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ పెవిలియన్ చేరాడు.

షకీబ్, రహీమ్లు అర్ధ సెంచరీలు:
రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును క్రీజులోకి వచ్చిన షకిబ్ అల్ హసన్ (75; 84 బంతుల్లో 8x4, 1x6), ముష్ఫికర్ రహీమ్ (78; 80 బంతుల్లో 8x4)లు అర్ధ సెంచరీలు చేసి ఆదుకున్నారు. ఈ ఇద్దరు బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ ఇద్దరు మూడో వికెట్కు 142 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 75 పరుగుల వద్ద షకిబ్ అవుట్ అయ్యాడు. కాసేపటికి మహ్మద్ మిథున్ (21).. మరో ఎనిమిది పరుగుల వ్యవధిలో రహీమ్ కూడా నిష్క్రమించాడు.

చెలరేగిన మహ్మదుల్లా:
చివరలో మొసెదెక్ హుస్సేన్ (26: 20 బంతుల్లో 4x4), మహ్మదుల్లా (46 నాటౌట్: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్), మహ్మద్ మిథున్ (21; 21 బంతుల్లో 2x4,1x6),లు చెలరేగారు. ముఖ్యంగా మహ్మదుల్లా బ్యాట్ జులిపించడంతో బంగ్లా భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోరిస్, తాహీర్, ఫెహ్లుకోవియా తలో రెండు వికెట్లు తీశారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' షకీబల్కి దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications