అక్టోబర్ చివర్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ - 2022కి జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. భారత్ టీ20 ప్రపంచకప్లో ప్రారంభ మ్యాచ్కు ముందు వార్మప్ మ్యాచ్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్ భారత్ ఆడనుంది. అంతకంటే ముందు.. భారత్ రెండు వార్మప్ మ్యాచ్లను బ్రిస్బేన్లోని గబ్బాలో ఆడనుంది.. అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్లలో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇకపోతే అక్టోబర్ 10నుంచే వార్మప్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అయితే గ్రూప్ స్టేజ్ జట్లు తొలుత వార్మప్ మ్యాచ్లు ఆడుతాయి. కాగా ఇప్పటికే సూపర్ 12లోకి ప్రవేశించిన 8 జట్లు తమ వార్మప్ మ్యాచ్లను అక్టోబర్ 17 నుంచి 19వరకు ఆడుతాయి. ఇక సూపర్ 12కు అర్హత సాధించేందుకు రెండు గ్రూపుల్లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. T20 ప్రపంచ కప్కు ముందు బ్రిస్బేన్ మరియు మెల్బోర్న్ మాత్రమే వార్మప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఈ వార్మప్లు ఏవీ అధికారిక టీ20 అంతర్జాతీయ హోదాను కలిగి ఉండవు. భారత్ ప్రస్తుతం యూఏఈలో ఆసియా కప్ ఆడుతోంది. అయితే సూపర్ 4దశలో పాకిస్థాన్, శ్రీలంకతో ఓడిపోయిన తర్వాత భారత సేన ఫైనల్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా నేడు తన చివరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్తో భారత్ తలపడనుంది. భారత్ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో 3మ్యాచ్ల టీ20 సిరీస్లు ఆడనుంది.
టీ20ప్రపంచకప్ 2022లో భాగంగా మొత్తం 16జట్లు తలపడనున్నాయి. వీటిలో ఇప్పటికే సూపర్ 12రౌండ్కు 8జట్లు అర్హత సాధించాయి. మిగతా 8 జట్లు క్వాలిఫయర్ రౌండ్లో తలపడతాయి. నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యుఏఈ, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ మరియు జింబాబ్వేలను 2గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్ 12రౌండ్కు అర్హత సాధిస్తాయి.
ఇక సూపర్ 12లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో పాటు క్వాలిఫయర్ రౌండ్లో గెలిచిన మరో 4జట్లు ఆడతాయి. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ప్రతి గ్రూప్లో ఒక్కో జట్టు అయిదు మ్యాచ్లు ఆడుతుంది. అందులో టాప్ 2 పొజిషన్లో ఉన్న రెండు జట్లు టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఫైనల్లో గెలిచిన జట్టు విశ్వవిజేతగా నిలుస్తుంది.