నో ప్లే.. నో పే:
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలుత ఐపీఎల్ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసినా.. కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ రద్దైతే ఒప్పందం మేరకు ఆటగాళ్లకు ఎటువంటి వేతనాలు చెల్లించేది లేదని ఓ ఫ్రాంఛైజీ అధికారి స్పష్టం చేశారు. దీంతో నో ప్లే.. నో పే.. ఈ ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్ల ముందున్న పరిస్థితి ఇదే.
పారితోషకాలు చెల్లించేది లేదు:
'ఐపీఎల్ చెల్లింపుల విధానం ప్రకారం.. సీజన్ ప్రారంభమయ్యే వారం రోజుల ముందు ఆటగాళ్లకు ఒప్పందంలో 15 శాతం డబ్బును చెల్లించాలి. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో 65 శాతం చెల్లించాలి. ఇక 20 శాతంను టోర్నీ ముగిసిన తర్వాత నిర్ణీత సమయంలో ఆటగాళ్లకు ముట్టజెప్పాలి. బీసీసీఐకి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ ఆటగాడికి పారితోషకాలు చెల్లించేది లేదు' అని ఓ ఫ్రాంఛైజీ అధికారి అన్నారు.
ఎలా చెల్లించగలం?:
'బీమా సంస్థ నిబంధనలో ఇలాంటి విపత్తు లేకపోవడంతో మాకు ఎటువంటి డబ్బులు రావు. వేతనాల కింద ఒక్కో ఫ్రాంఛైజీ రూ.75 నుంచి రూ.85 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ జరగకపోతే.. మేం ఎలా చెల్లించగలం?. కొన్ని లీగుల్లో కూడా ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికంలో కోత విధించారు. ప్రస్తుత ఉన్న క్లిష్ట పరిస్థితులు సాధారణంగా ఎప్పుడూ మారతాయో చెప్పలేం. అయితే కష్టపడి వేలంలో ఎంపికైన ఎంతో మంది యువ క్రికెటర్లు ఐపీఎల్తో తమ జీవితాలు మారిపోతాయని ఆశించారు. బీసీసీఐ ఐపీఎల్ను నిర్వహించి వాళ్లకు దోహదపడుతుందని ఆశిస్తున్నా' అని మరో ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
కోత గురించి చర్చలు జరపలేదు:
మరోవైపు ఆటగాళ్ల పారితోషికాల్లో కోత గురించి ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరపలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు. 'బీసీసీఐకి సంబంధించి ఐపీఎల్ అతి పెద్ద టోర్నమెంట్. అయితే కోతల గురించి ఇంకా చర్చ జరగలేదు. మున్ముందు మాట్లాడతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో లెక్కలు, నష్టాల గురించి అంచనాలు వేయడం అంత సులువు కాదు. ఆఫీస్ బేరర్లందరూ సమావేశమైతేనే గణాంకాల గురించి ఇప్పుడే చెప్పలేం' అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకి సుమారు 3 వేల కోట్ల వరకు నష్టం జరుగుతుందని ఒక అంచనా.
వేతనాల విషయంలో ఇబ్బందులు:
అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ క్రికెటర్లకు వేతనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బీసీసీఐకి క్రికెట్ నుంచి ఆదాయం వస్తుందని, క్రికెట్ జరగకపోతే వారికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. దీంతో అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లకు ప్రభావం ఉంటుందని అన్నారు. అయితే ఇది బోర్డు తప్పు కాదు, ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అని ఆయన అభిప్రాయపడ్డారు.
వర్థమాన ఆటగాళ్లకే ఇబ్బంది:
నిజానికి ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుపై విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లేమీ ఆధారపడి లేరు. వారు ఇతరత్రా వ్యాపారాలతో వందల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ.. చిన్న నగరాల నుంచి ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్న యువ ఆటగాళ్లకు, దేశవాళీల్లో రాణిస్తున్న వారికి ఈ లీగ్ జరగడం చాలా ముఖ్యం. లీగ్ జరగకుంటే.. ఆర్థికంగా చాలా ప్రభావం పడుతుంది. కొత్తగా ఆడుతున్న వారికైతే రూ.20 నుంచి 40, 60 లక్షలు దక్కినా.. అది వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.