స్లీపింగ్ ఫొటో వైరల్
మూడో టెస్ట్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా.. ఓ సమయంలో రవిశాస్త్రి పెవిలియన్ బాల్కనీలో కుర్చోని కునుకు తీస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు కురిపించారు. 'రవిశాస్త్రిది ప్రపంచంలోనే ఉత్తమమైన ఉద్యోగం', 'పని సమయంలో కునుకు తీస్తున్న రవిశాస్త్రికి కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారు', 'నిద్రపోవడానికి పది కోట్ల రూపాయలు చెల్లించాలా' అని నెటిజన్లు మండిపడ్డారు.
ఒక్క బంతిని కూడా మిస్ కాలేదు
తాజాగా రవిశాస్త్రి స్పందించారు. 'సోషల్ మీడియాలో నాపై వచ్చిన వ్యాఖ్యల గురించి బాధపడటం లేదు. ఎంజాయ్.. ఎంజాయ్ చేయండి. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నేను ఒక్క బంతిని కూడా మిస్ కాలేదు' అని రవిశాస్త్రి అన్నారు. రవిశాస్త్రి అనేక సందర్భాల్లో ట్రోల్ చేయబడ్డాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో, ఇటీవల ముగిసిన విండీస్ పర్యటనలో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇక సౌరవ్ గంగూలీ బీసీసీఐ నూతన అధ్యక్షుడుగా ఏకగ్రీవం అయినప్పుడు కూడా ట్రోల్ చేయబడ్డారు.
రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా సాగింది
ఏదేమైనా భారత క్రికెట్ జట్టుతో రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా సాగింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ప్రస్తుతం 240 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాను అధిగమించి స్వదేశంలో వరుసగా 11 టెస్ట్ సిరీస్లను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి సిరీస్ నెగ్గింది. అంతకుముందు వెస్టిండీస్ను 2-0తో ఓడించింది. వచ్చే నెల 3 నుండి బంగ్లా సిరీస్ ప్రారంభం కానుంది.
ఏడాదికి రూ. 10 కోట్ల జీతం
ఇటీవల రెండోసారి భారత హెడ్ కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి 2021లో జరగనున్న టీ20 వరల్డ్కప్ వరకూ ఆ పదవిలో ఉండనున్నాడు. రవిశాస్త్రి జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచింది. రవిశాస్త్రికి ప్రస్తుతం ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల మేర పెరిగింది. వన్డే ప్రపంచకప్ ఓటమి నేపథ్యంలో రవిశాస్త్రిపై వేటు పడుతుందని అంతా ఊహించారు. కానీ.. బీసీసీఐ మళ్లీ అతడికే పట్టం కట్టింది.