|
ప్రమాదకర బౌలర్ను..
ఈ నేపథ్యంలో- సోమవారం క్రిక్కిరిసి పోయిన విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడారు. జట్టులో నాణ్యమైన బౌలర్ లేని ప్రతీసారి తాను బౌలింగ్ చేశానని కోహ్లీ సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను ఆల్రౌండర్గా ఎదగాలనే ఉద్దేశంతో కేరీర్ను మొదలు పెట్టానని చెప్పారు. ఆల్రౌండర్ అనిపించుకోవాలనే కోరికతో బౌలింగ్పైనా పట్టు సాధించానని అన్నారు. తనకు బౌలింగ్ చేయాల్సిన అవసరం గానీ, అవకాశం గానీ రాలేదని కోహ్లీ వ్యాఖ్యానించారు. తాను అత్యంత ప్రమాదకరమైన బౌలర్నని అన్నారు. బౌలర్లు ఆశించినదాని కంటే ఎక్కువగా రాణిస్తున్నారని కోహ్లీ చెప్పారు. ప్రత్యర్థులను తక్కువ పరుగులు నిర్దేశించిన మ్యాచ్లల్లోనూ జట్టును గెలిపిస్తున్నారని ప్రశంసించారు.
|
జట్టు కూర్పుపై..
సెమీఫైనల్లో ఆడబోయే జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని కోహ్లీ అన్నారు. టీమ్ మేనేజ్మెంట్తో చర్చిస్తున్నామని చెప్పారు. జట్టులో అయిదుమంది బౌలర్లను తీసుకోవాలా? లేక మరో బౌలర్ను అదనంగా తీసుకోవాలా? అనే అంశం ఇంకా చర్చల దశలో ఉందని అన్నారు. ఓపెనర్గా కేఎల్ రాహుల్ కుదురుకున్నాడని, ఇక అతణ్ని ఓపెనింగ్ స్థానం నుంచి తప్పించే ఆలోచన ఏదీ చేయట్లేదని కోహ్లీ స్పష్టం చేశారు. శ్రీలంకతో మ్యాచ్లో కోహ్లీ సెంచరీ బాదిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సెమీస్ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు..
మంగళవారం మాంచెస్టర్లో జరగబోయే తొలి సెమీఫైనల్ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదని కోహ్లీ అన్నారు. ఈ విషయంలో తాను గానీ, తోటి జట్టు సభ్యులు గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పారు. సెమీఫైనల్ మ్యాచ్ గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. అంతగా మానసిక ఒత్తిడికి గురి అవుతామని అన్నారు. అందుకే- సెమీస్ గురించి ఆందోళన పడొద్దని తాను జట్టు సహచరులకు సూచించినట్లు చెప్పారు. ప్రస్తుతం తాము రిలాక్సింగ్ మూడ్లో ఉన్నామని అన్నారు. ప్రతి మ్యాచ్కు ముందూ కొద్దో, గొప్పో ఒత్తిడి ఆటగాళ్లపై ఉండటం సహజమని చెప్పారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోవడానికి తాము సంసిద్ధులై ఉన్నామని చెప్పారు.
ఇలాంటి రోజొకటి వస్తుందని అనుకోలేదు..
న్యూజిలాండ్ జట్టు కేప్టెన్ కేన్ విలియమ్సన్, బౌలర్ ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీతో పాటు చాలామంది క్రికెటర్లు తన బ్యాచ్మేట్లని, తామందరం కలిసి అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడామని అన్నారు. తన బ్యాచ్మేట్లతోనే మరోసారి ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడాల్సిన రోజు ఒకటి వస్తుందని తాను ఏమాత్రం ఊహించనే లేదని చెప్పారు. ప్రపంచకప్ అండర్ 19 జట్లకు ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని తాను విలియమ్సన్కు గుర్తు చేస్తానని చమత్కరించారు. టాస్ గురించి కూడా చింతించాల్సిన పని లేదని అన్నారు. టాస్ గెలిచినా, ఓడిపోయినా తమ ఆటతీరులో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. మ్యాచ్ ఫలితాన్ని టాస్ శాసిస్తుందని తాను అనుకోవట్లేదని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు.
రోహిత్..మళ్లీ హిట్ అవుతాడు..
ప్రపంచకప్ టోర్నమెంట్లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడని కోహ్లి కితాబిచ్చారు. సెమీఫైనల్లో కూడా అతను అదరగొడతాడనే నమ్మకం ఉందని చెప్పారు. సెమీఫైనల్లో ఒకటి, ఫైనల్ మ్యాచ్లో ఇంకొకటి.. ఇలా రోహిత్ శర్మ మరో రెండు సెంచరీలను బాదేస్తాడని జోస్యం చెప్పారు కోహ్లీ. మహేంద్రసింగ్ ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అరుదుగా దొరికే అవకాశమని అన్నారు. ధోనీ చక్కని సలహాలు ఇస్తుంటాడని, అతని చిట్కాలు తన కేప్టెన్సీకి పనికొస్తున్నాయని చెప్పారు. ధోనీ కేప్టెన్సీలోనే తాను టీమిండియా జట్టుకు ఎంపికయ్యానని అన్నారు.ధోనీ వంటి ఆటగాడితో కలిసి ఆడటం అదృష్టమని అన్నారు.
సెంచరీపై ఆసక్తి లేదు..
ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇప్పటికే సెంచరీని సాధించానని కోహ్లీ అన్నారు. మరిన్ని సెంచరీలను చేయాలనే ఉద్దేశం గానీ, ఆశగానీ ప్రస్తుతం తనకు లేదని, జట్టు అవసరాలు, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంపైనే తాను దృష్టి కేంద్రీకరించానని అన్నారు. వ్యక్తిగత పరుగులు, అర్ధసెంచరీలు, సెంచరీలపై ఏ ఆటగాడు ఫోకస్ పెట్టడని, జట్టును గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడగారని చెప్పారు. రోహిత్ శర్మ కూడా రికార్డుల కోసం ఎప్పుడూ ఆడబోడని, అతని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రికార్డులు పుట్టుకొస్తుంటాయని అన్నారు. ఇంకో రెండు మ్యాచ్లను గెలవాలని గట్టిగా ఆశిస్తున్నానని అన్నారు కోహ్లీ.