సిరీస్ ఓటమికి ధోనిని బాధ్యుడిని చేశారు
దీనిపై తాజాగా సందీప్ పాటిల్ మాట్లాడుతూ "ఇంగ్లాండ్ గడ్డపై భారత్ వన్డే సిరీస్ ఓటమికి ధోనిని బాధ్యుడిని చేశారు. దీనిపై మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. గత 14 ఏళ్లుగా ధోనీ నాకు తెలుసు. అంతర్జాతీయ క్రికెట్లోకి ధోనీ తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నేను అతన్ని చూస్తున్నాను. ఎంతో దగ్గర్నుంచి అతడ్ని పరిశీలించాను" అని అన్నాడు.
ధోనితో కలిసి పని చేశాను
"ఇండియా-ఎ కోచ్గా, బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా ధోనితో కలిసి పని చేశాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ఒకటి మాత్రం చెప్పగలను. ధోని ఇప్పుడే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడు. మరికొంత కాలం క్రికెట్ ఆడతాడు. అయితే, అది ఎప్పటి వరకు అనేది మాత్రం చెప్పలేను" అని సందీప్ పాటిల్ తెలిపాడు.
ధోని మంచి ఫినిషర్, కెప్టెన్ కూల్ అని మాత్రమే తెలుసు
"చాలా మందికి ధోని మంచి ఫినిషర్, కెప్టెన్ కూల్ అని మాత్రమే తెలుసు. క్రికెట్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వారికి మాత్రమే వికెట్ కీపర్గా ధోని భారత్కు ఏం చేశాడన్నది తెలుస్తుంది. ఫిట్నెస్, ప్రదర్శనను దృష్టిలో ఉంచుకునే సెలక్టర్లు ఆటగాళ్లను ఎంపిక చేస్తారని మరోకసారి చెబుతున్నా" అని పాటిల్ అన్నాడు.
సెలక్టర్ల సొంత పెత్తనం ఉండదు
"జట్టు ఎంపికకు ముందు సెలక్టర్లు.. కెప్టెన్, కోచ్ను తప్పకుండా సంప్రదిస్తారు. జట్టు ఎంపిక చేసే సమయంలో సెలక్టర్ల సొంత పెత్తనం ఉండదు" అని మరొకసారి సందీప్ పాటిల్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనలో ధోని అనేక రికార్డులు సాధించాడు.
టీ20ల్లో 50 క్యాచ్లు అందుకున్న తొలి వికెట్ కీపర్
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో ధోని రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అందులో ఒకటి టీ20ల్లో 50 క్యాచ్లు అందుకున్న తొలి వికెట్ కీపర్ కాగా, రెండోది ఒక ఇన్నింగ్స్లో 5 క్యాచ్లు అందుకున్న తొలి వికెట్ కీపర్గా ధోని చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, ఈ పర్యటనలో ధోని వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.