హైదరాబాద్: ప్రతిభావంతులైన క్రికెటర్లను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చక్కగా అందిపుచ్చుకున్నాడని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. జూలై8న పుట్టిన రోజు జరుపుకున్న గంగూలీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. కెప్టెన్గా ఉన్న సమయంలో గంగూలీ జట్టులోకి ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశమిచ్చాడని కొనియాడారు. ఇలా టీమిండియాను పటిష్ఠమయ్యేలా గంగూలీ కృషి చేశాడని పేర్కొన్నారు. ఇలా వచ్చిన వాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకరని గుర్తు చేశారు పలువురు మాజీ క్రికెటర్లు.
'ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గంగూలీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాడు. వారిని జట్టులోకి తీసుకుంటాడు. తుది జట్టులో అవకాశం ఇస్తాడు. ఒక్కసారో, రెండుసార్లో ఫెయిలయ్యారని వారిని పక్కన పెట్టడు. వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చి తామేంటో రుజువు చేసుకోవాలని సూచిస్తాడు. ప్రతిభను నమ్మి అవకాశాలు ఇస్తాడు. యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్మజన్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ తదితరులే ఇందుకు సాక్షులు'
'వీరంతా ఎంతో సహజ సిద్ధమైన ఆటగాళ్లు. వీరందరితోనే గంగూలీ బలమైన టీమిండియాను తయారు చేయగలిగాడు. ఇందుకు మహేంద్ర సింగ్ ధోనీనే ఉదాహరణ. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తర్వాత సుమారు నాలుగు ఇన్నింగ్స్ల్లో ధోనీ పెద్దగా రాణించింది లేదు. తొలి మ్యాచ్లో అయితే డకౌట్ అయ్యాడు. అయినా అతడిపై ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా మరిన్ని అవకాశాలు ఇచ్చాడు'
'ఆ క్రమంలోనే ధోనీ పాక్పై 148 పరుగులు చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో ధోనీ కెరీరే మారిపోయింది. ఒకవేళ గంగూలీ.. ధోనీకి అలా అవకాశాలు ఇవ్వకపోతే భారత్ గొప్ప వికెట్ కీపర్ను కోల్పోయేది' అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.