హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఇనిస్టాగ్రామ్లో చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలంక వేదికగా జరుగుతోన్ననిదాహాస్ ముక్కోణపు టోర్నీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనిలతో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
తనకు లభించిన విశ్రాంతిని ధోని కుటుంబ సభ్యులతో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి గడిపిన మధుర క్షణాలను ఓ వీడియో రూపంలో బంధించి అభిమానులతో పంచుకున్నాడు. దీనికి 'ఫన్ టైం విత్ ఫ్యామిలీ' అని పోస్టు చేశాడు.
ధోని ఈ వీడియో పోస్టు చేసిన గంటలోపే సుమారు 3 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో ధోని పెంపుడు కుక్కలను కూడా మనం చూడొచ్చు. కాగా, స్టార్ ఇండియా సోమవారం విడుదల చేసిన ఐపీఎల్ గీతాన్ని కూడా ధోనీ తన ట్విటర్లో షేర్ చేశాడు. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో భాగంగా ఏప్రిల్ 7న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇటీవలే బీసీసీఐ విడుదల చేసిన వార్షిక కాంట్రాక్టు జాబితాలో ధోని ఏ గ్రేడ్లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.