
ఎల్బీలుగా 25 మంది:
ఈ సిరీస్లో భారత బౌలర్లు 25 మంది ఇంగ్లండ్ బ్యాట్స్మన్ను ఎల్బీలుగా ఔట్ చేశారు. ఇదే టీమిండియా తరఫున అత్యధికంగా నమోదైంది. గతంలో రెండు సందర్భాల్లో టీమిండియా బౌలర్లు 24 వికెట్లను ఎల్బీల రూపంలో సాధించారు. 40 ఏళ్ల క్రితం ఆసీస్తో జరిగిన సిరీస్లో భారత బౌలర్లు 24 ఎల్బీలు చేయగా.. 2016-17లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో 24 మందిని వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నారు. అదే సీజన్లో న్యూజిలాండ్ జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా 22 మందిని ఎల్బీలుగా పెవిలియన్కు పంపింది.

భారత్3:
నాలుగు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్లో ఓటమి పాలైన తర్వాత టీమిండియా సిరీస్ను గెలవడం ఇది మూడోసారి. 2016-17 సీజన్లో ఆసీస్తో జరిగిన సిరీస్లో కూడా టీమిండియా ఇలానే తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత సిరీస్ను దక్కించుకుంది. ఆ నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. మళ్లీ 2020-21 సీజన్లో భాగంగా ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా టీమిండియా మొదటి మ్యాచ్లో పరాజయం చవిచూసి ఆపై సిరీస్ను 2-1 తో గెలుచుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్పై 3-1తో సిరీస్ను చేజిక్కించుకుంది.

తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత:
ఓవరాల్గా చూస్తే టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత సిరీస్ను దక్కించుకున్న సందర్బాలు ఇప్పటివరకూ ఆరు ఉన్నాయి. 1972-73 సీజన్లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా 2-1తో సాధించింది. 2000-01 సీజన్లో ఆసీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. ఆ తర్వాత 2015లో శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. ఇవన్నీ తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన తర్వాత సిరీస్ను గెలుచుకున్న సందర్భాలు.

స్టీవ్ వాని వెనక్కినెత్తిన కోహ్లీ:
భారత్ గడ్డపై విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 23 టెస్టుల్లో భారత్ విజయాన్ని అందుకుంది. తాజా విజయంతో 22 విజయాలతో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వాని కోహ్లీ వెనక్కి నెట్టేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 30 విజయాలతో టాప్లో ఉండగా.. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ (29) రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా 23 విజయంతో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో ఓవరాల్గా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలోనూ నాలుగో స్థానంలో ఉన్న క్లైవ్ లాయిడ్ని కోహ్లీ ఈరోజు సమం చేశాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్ 53 టెస్టు విజయాలతో అగ్ర స్థానంలో ఉండగా.. ఆ తర్వాత పాంటింగ్ (48), స్టీవ్ వా (41) టాప్-3లో ఉన్నారు.

అక్షర్ 4:
అరంగేట్రం తర్వాత మొదటి మూడు టెస్టుల తరువాత ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో నరేంద్ర హిర్వానీ (31-1988), చార్లీ టర్నర్ (29-1887), రోడ్నీ హాగ్ (27-1978-79), అక్షర్ పటేల్ (27-2021) వరుసగా ఉన్నారు. చెన్నైలో జరిగిన రెండో టెస్ట్ ద్వారా అక్షర్ భారత్ తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 4 మ్యాచులలో 32 వికెట్లు పడగొట్టి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధికంగా 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకుంది ముత్తయ్య మురళీధరన్ (11). జాక్వెస్ కలిస్ (9), ఆర్ అశ్విన్(8), ఇమ్రాన్ ఖాన్ (8), రిచర్డ్ హాడ్లీ (8), షేన్ వార్న్ (8) వరుసగా ఉన్నారు.

అవార్డ్స్ లిస్ట్:
మ్యాన్ ఆఫ్ డి మ్యాచ్: రిషబ్ పంత్
మ్యాన్ ఆఫ్ ది సిరీస్: రవిచంద్రన్ అశ్విన్
అత్యధిక పరుగులు: జో రూట్ (368)
అత్యధిక సిక్సులు: రిషబ్ పంత్ (10)
అత్యధిక బౌండరీలు: రోహిత్ శర్మ (43)
అత్యధిక క్యాచులు: రహానే-పంత్ (8)
అత్యధిక ఫైఫర్: అక్షర్ (4)


Click it and Unblock the Notifications
