ఢిల్లీ: ఎవరితో కలిసి బ్యాటింగ్ చేస్తే బాగుంటుందో టీమిండియా యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ చెప్పాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్నర్ అని వెల్లడించాడు. మహీతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే అసలు సమస్యలే లేనట్టు అనిపిస్తుందన్నాడు. ధోనీ ఓ ప్రణాళిక ఇస్తాడు, దానిని అనుసరిస్తే చాలని పంత్ చెప్పాడు. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ధోనీ తనకు సలహాలు చెప్పేవాడని, అయితే పూర్తిస్థాయి పరిష్కారం మాత్రం ఇవ్వకపోవడంతో వాటిని తనే పరిష్కరించుకునేవాడినని, ఇలా చేయడంతో మహీపై అతిగా ఆధారపడకుండా ఉండటానికి వీలయ్యేదని పంత్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ మాట్లాడుతూ... 'నా ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్నర్ ఎంఎస్ ధోనీ. కానీ అతడితో కలిసి ఆడే అవకాశాలు అరుదుగా దొరుకుతాయి. ఒకవేళ మహీ గనక క్రీజులో ఉంటే అంతా సర్దుకుంటుంది. అతడో ప్రణాళిక ఇస్తాడు, దానిని అనుసరిస్తే చాలు. ఛేదనల్లో మహీ పనితీరు అద్భుతం' అని అన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో పంత్ ఇప్పటివరకు 13 టెస్టుల్లో, 16 వన్డేల్లో, 28 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
కఠిన సందర్భాల్లో సీనియర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని యువ కీపర్ రిషభ్ పంత్ చెప్పాడు. 'విరాట్ భాయ్, రోహిత్ భాయ్తో కలసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తాను. సీనియర్లతో ఎప్పుడైనా బ్యాటింగ్ చేస్తే సరికొత్త అనుభవం వస్తుంది. చాలా సరదాగా ఉంటుంది. వారి ఆలోచనా విధానం తెలుస్తుంది. అదంతా ఓ ప్రత్యేకమైన కెమిస్ట్రీ. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్ భయ్యాతోనూ అంతే' అని రిషబ్ పంత్ వెల్లడించాడు.
'మహీ భాయ్ నాకు మెంటార్ లాంటి వాడు. మైదానం లోపల, బయట ఎన్నో విషయాల్లో అతడే నాకు స్ఫూర్తి. యువ ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడానికి ధోనీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సమస్యలు ఎదురైనప్పుడు ధోనీ కొన్ని సలహాలు చెప్పేవాడు. అయితే అవి పూర్తిస్థాయిలో మాత్రం ఉండేవి కావు. సమస్యలను నేనే సాల్వ్ చేసుకోవాలని కొంచెం హింట్ మాత్రమే ఇచ్చేవాడు. దీంతో ధోనీపై అతిగా ఆధారపడకుండా ఉండటానికి వీలయ్యేది' అని పంత్ పేర్కొన్నాడు.
రిషభ్ పంత్ తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన రెండేళ్ల కాలంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు. కెరీర్ మొదట్లో ఒక కీలక ఆటగాడిగా ఉన్న పంత్.. ఆ తర్వాత ఫామ్ను కోల్పోయి జట్టులో స్థానంపై నమ్మకాన్ని కోల్పోయాడు. పంత్ టాలెంటెడ్ ఆటగాడని చెబుతూ వచ్చిన మేనేజ్మెంట్ పెద్దలే అతన్ని పక్కన పెట్టేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్తో జరిగిన సిరీస్లో పంత్కు అయిన గాయం అతని కెరీర్నే ప్రమాదంలో పడేసింది. పంత్ స్థానంలో కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కేఎల్ రాహుల్.. అటు బ్యాట్స్మన్గా, ఇటు కీపర్గా రాణించడంతో పంత్ అవసరం లేకుండా పోయింది.
వైరల్ వీడియో.. హ్యాట్రిక్ మిస్ చేసిన డేవిడ్ వార్నర్!!