వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్కు సిద్ధమైంది. శనివారం లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరగనున్న మూడో వన్డే అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానుంది. ఇక ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ తమ జట్టుకు చాలా ఎమోషనల్గా ఉంటుందని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అన్నారు. మూడు గేమ్ల సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లను గెలుచుకోవడం ద్వారా భారత్ ఇప్పటికే వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తద్వారా గోస్వామికి సరైన వీడ్కోలు పలకడానికి వేదిక ఖరారైంది. 'లార్డ్స్ గేమ్ మాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఝులన్ రిటైర్మెంట్. ఆ గేమ్ను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆస్వాదించాలనుకుంటున్నాం. మేము ఈ రోజు గెలవగలిగాం. ఇప్పుడు సిరీస్ గెలుపొందాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి మ్యాచ్లోనూ రాణిస్తాం. ఆమె కోసం ఆ మ్యాచ్ గెలవాలని చూస్తున్నాం' అని హర్మన్ప్రీత్ పేర్కొంది.
భారత క్రికెట్కు గోస్వామి చేసిన అపారమైన సహకారాన్ని గురించి హర్మన్ప్రీత్ పేర్కొంది. 'ఆమె నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను అరంగేట్రం చేసినప్పుడు ఆమె కెప్టెన్. ఇప్పుడు మా జట్టు యువ బౌలర్లు రేణుక సింగ్, మేఘనా సింగ్ ఆమె నుంచి నేర్చుకున్నారు.
ఆమె ద్వారా బౌలింగ్ రిథమ్ గురించి అవగహన పొందుతున్నారు. ఆమె మా అందరికీ గొప్ప ప్రేరణ.' అని హర్మన్ చెప్పింది. ఝులన్ గోస్వామి 12 టెస్టులు, 68 టీ20లు, 203 వన్డేలు ఆడింది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 353అంతర్జాతీయ వికెట్లు తీసింది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆమె కొనసాగుతుంది.