|
టీమిండియా జెర్సీ ధరించకపోవడం బాధించింది:
తొలి వన్డే సందర్భంగా యుజువేంద్ర చహాల్ టీవీతో హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. చహాల్ ప్రశ్నలు సంధించిగా.. పాండ్యా సమాధానాలు ఇచ్చాడు. 'గత ఆరునెలలుగా టీమిండియాకు ఆడకపోవడంతో ఆ అనుభవాన్ని చాలా మిసయ్యా. భారత జెర్సీ ధరించకపోవడం నన్ను బాధించింది. అది మానసికంగా ఎంతో కుంగదీసింది. అలాగే అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి' అని పాండ్యా తెలిపాడు.
20 సిక్సులు ఎప్పుడూ బాదాలనుకోలేదు:
'గాయం తర్వాత త్వరగా కోలుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. పునరావాస శిక్షణలో భాగంగా జాతీయ క్రికెట్ అకాడమీలో అనేక మంది సహకరించారు. దీంతో పూర్తిగా కోలుకున్నా. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నాకు చాలా కీలకం. ఎందుకంటే గత ఆరున్నర నెలలుగా నేను క్రికెట్ ఆడలేదు. తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో బాగా ఆడాలనుకుంటున్నా. నాకు ఆత్మవిశ్వాసం అవసరమని భావించి టీ20ల్లో చెలరేగా. కొన్నిసార్లు ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాచ్లో రాణించలేకపోతాం. భారీ సిక్సులు బాగా ఆడగలుగుతుంటే.. ఎందుకు ఆపాలని భావించా. ఒకే ఇన్నింగ్స్లో 20 సిక్సులు ఎప్పుడూ బాదాలనుకోలేదు' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
39 బంతుల్లోనే సెంచరీ:
హార్దిక్ పాండ్యా చివరిసారి 2019 సెప్టెంబర్లో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్కు ముందు న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక అవుతాడని భావించినా పాండ్యా అప్పటికి పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ముంబైలో జరిగిన డివై పాటిల్ టీ20 కప్లో వరుసగా రెండు శతకాలతో చెలరేగాడు. 55 బంతుల్లో 20 సిక్స్లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసాడు. దీంతో జాతీయ జట్టులో 'రీ ఎంట్రీ' కోసం తహతహలాడుతున్నాడు.
అయ్యర్ రికార్డు బద్దలు:
158 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును హార్దిక్ పాండ్యా నమోదు చేశాడు. అంతకుముందు టీ20 ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అయ్యర్ 147 పరుగులు చేసాడు. ఇప్పుడు ఆ రికార్డును హార్దిక్ బ్రేక్ చేశాడు.