పాండ్యా, రాహుల్లపై సస్పెన్షన్ ఎత్తివేయండి!: సీఓఏకి ఖన్నా విజ్ఞప్తి

హైదరాబాద్: టీమిండియా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లపై సస్పెన్షన్ ఎత్తేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సుప్రీం కోర్టు నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఆయన శనివారం సీఓఏకు లేఖ రాశారు. విచారణ పూర్తయ్యే వరకు వాళ్లను టీమిండియాలోకి తీసుకోవాలని సూచించాడు.
పాండ్యా, రాహుల్ వివాదంపై ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక జనరల్ సమావేశం జరపలేమని సీకే ఖన్నా స్పష్టం చేశారు. "ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లింది. ధర్మాసనం వచ్చే వారం విచారణ కూడా చేపట్టనుంది. ఈ సమయంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎమ్) ఏర్పాటు చేసి క్రికెటర్ల అంశాన్ని చర్చించలేం. రాహుల్, పాండ్యా తప్పు చేశారు" అని ఖన్నా పేర్కొన్నాడు.

ఇప్పటికే వారిద్దరిపై నిషేధం
"వారిద్దర్ని సస్పెండ్ కూడా చేశారు. ఇప్పటికే వారిపై నిషేధం విధించి ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా రప్పించాం. ఇద్దరు ఆటగాళ్లు వారి వ్యాఖ్యల పట్ల బేషరతు క్షమాపణలు చెప్పారు. కాబట్టి విచారణ పూర్తయ్యేలోపు వాళ్లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. వీలైనంత త్వరగా కివీస్తో సిరీస్కు వాళ్లను పంపిస్తే మంచిది" అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్కు రాసిన లేఖలో కోరారు.

తుది అధికారం బోర్డుకే
బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్మన్కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్మన్ను నియమించలేమన్న సుప్రీం.. ఆటగాళ్లపై చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డుకే ఉంటుందని స్పష్టం చేసింది.

వారం రోజుల తర్వాత వాదనలు వింటామన్న సుప్రీం
అంతేకాదు అంబుడ్స్మన్ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని బీసీసీఐ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాదించడంతో ఈ కేసును వాయిదా వేసింది. వారం రోజుల తర్వాత వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఆటగాళ్లపై సస్పెన్షన్ కొనసాగిచండం సరైందరి కాదని ఖన్నా అభిప్రాయపడ్డాడు.

ఖన్నాను కోరిన 14 రాష్ట్ర సంఘాలు
దీంతో 10 రోజుల్లోగా ఎస్జీఎమ్ను ఏర్పాటు చేయాలని దాదాపు 14 రాష్ట్ర సంఘాలు ఖన్నాను కోరాయి. తాత్కాలిక కోశాధికారి అనిరుధ్ చౌదరి కూడా అంబుడ్స్మన్ను నియమించాలని లేఖ రాశాడు. దీనిపై స్పందించిన ఖన్నా.. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం తగదని, అలా చేస్తే కోర్టు ధిక్కరణకు వస్తుందని స్పష్టంగా వివరించాడు.

సీఓఏ, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్కు సైతం ఖన్నా విజ్ఞప్తి
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఓఏ, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్కు సైతం విజ్ఞప్తి చేశారు. "పాండ్యా, రాహుల్ అనుచితంగా మాట్లాడారు. ఇది పూర్తిగా తప్పే. అయితే వీళ్లిదర్ని దోషులుగా, చట్టాలను వ్యతిరేకించేవారిగా చూడొద్దని నా వ్యక్తిగత అభిప్రాయం. కీలకమైన వరల్డ్కప్నకు ముందు వీళ్లకు ప్రాక్టీస్ అవసరం. నాలుగు నెలల సమయమే ఉంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్లు.. నైతికంగా వాళ్లను వాళ్లు సరిదిద్దుకునే అవకాశాన్ని మనం కల్పించాలి" అని ఖన్నా వ్యాఖ్యానించాడు.

‘కాఫీ విత్ కరణ్' టీవీ షోలో
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్' టీవీ షోలో పాండ్యా, రాహుల్లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో పాండ్యా మాట్లాడుతూ "అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్ మై కర్ కే ఆయా' (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా" అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications