హార్దిక్ విఫలం:
అంతర్జాతీయ మ్యాచ్ ప్రమాణాలకు తగిన విధంగా ఫిట్నెస్ టెస్టులో సాధించాల్సిన కనీస స్కోరును పాండ్యా అందుకోలేకపోయాడు. ఇక కివీస్ పర్యటనకు వెళ్లే భారత్ 'ఎ' పరిమిత ఓవర్ల జట్టు నుంచి కూడా పాండ్యాను తప్పించారు. రంజీ మ్యాచ్ల్లో ఆడించకుండానే పాండ్యాను నేరుగా 'ఎ' జట్టులో తీసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా స్థానంలో విజయ్ శంకర్కు చోటు కల్పించారు.
టీ20 జట్టుపైనే అందరి దృష్టి:
ఈనెల 24న ప్రారంభమయ్యే ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో న్యూజిలాండ్తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్లను సెలెక్షన్ కమిటీ ఆదివారం ఎంపిక చేయనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కోసం 15 మందితో కూడిన జట్లను కాకుండా.. 16లేదా 17మందిని ఎంపిక చేసే అవకాశమున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరుగనుండడంతో పొట్టి ఫార్మాట్ జట్టుపైనే అందరి దృష్టి ఉంది.
జాదవ్ అనుమానమే:
టీ20 జట్టునే వన్డేలకు కూడా కొనసాగిస్తారా? అనేది వేచిచూడాలి. వన్డే జట్టులో కేదార్ జాదవ్ స్థానం అనుమానంగా ఉంది. కివీస్ గడ్డపై గతంలో అతడి బ్యాటింగ్లోనూ లోపాలు కనిపించాయి. మెరుగైన బ్యాట్స్మన్ కావాలనుకుంటే అజింక్య రహానె పేరును పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ టీ20 తరహాలోనే వన్డేల్లోనూ మెరుపు బ్యాటింగ్ను ఆశిస్తే.. ముంబై బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ఐదు లేక ఆరో నెంబర్లో జట్టుకు ఉపయోగపడగలడు. ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులో కొనసాగనున్నాడు. ఇది మినహా గత నెల విండీస్పై ఆడిన ఆటగాళ్లే కివీస్తో 50 ఓవర్ల సిరీస్లో ఉండే అవకాశం ఉంది.
మూడో ఓపెనర్ కోసం పోటీ:
స్వదేశంలో బంగ్లాదేశ్ను క్లీన్స్వీప్ చేసిన భారత జట్టే దాదాపుగా కివీస్తో టెస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే మూడో ఓపెనర్ స్థానం కోసం పోటీ తీవ్రంగా మారింది. రోహిత్, మయాంక్ అగర్వాల్ రెగ్యులర్ ఓపెనర్లుగా ఉండగా.. రిజర్వ్ ఓపెనింగ్ స్థానం కోసం శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్లు పోటీపడుతున్నారు. దేశవాళీ క్రికెట్లో గిల్ పరుగుల వరద పరిస్తుంటే.. జాతీయ జట్టు తరఫున రాహుల్ పరిమిత ఓవర్ల క్రికెట్లో విజృంభిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఎవరికి చాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మూడో స్పిన్నర్ కావాలంటే:
టెస్టుల్లో పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ చోటు పక్కా కాగా.. ఐదో పేసర్ను తీసుకోవాలంటే నవదీప్ సైనీకి పిలుపురావొచ్చు. ఒకవేళ మూడో స్పిన్నర్ను ఎంపిక చేయాలని నిర్ణయిస్తే.. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాకు కుల్దీప్ యాదవ్ జతకలుస్తాడు.