
ముంబై: దేశంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నా కొందరు వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీద తిరగటంపై భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులను చూసి మన వైఖరి మార్చుకోవాలని, వారంతా మన కోసం జీవితాలను పణంగా పెడుతున్నారనే విషయం మర్చిపోవద్దు అని హర్భజన్ అన్నాడు. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రజలు రోడ్ల మీద తిరగకుండా 21 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పినా.. కొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అవసరం లేకున్నా రోడ్ల మీదకు వస్తున్నారు. అంతేకాకుండా పలువురు పోలీసులపై ఎదురుతిరుగుతున్నారు. కొన్ని చోట్ల అయితే దాడులకూ పాల్పడుతున్నారు. అలాంటి వీడియోనే ఒకటి ట్విటర్లో పోస్టు చేసిన హర్భజన్.. దాడి చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'పోలీసుల పట్ల మన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి. మనల్ని కాపాడడం కోసం వారు జీవితాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దు. వారికి కూడా కుటుంబాలున్నా.. దేశం కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. మన భవిష్యత్ బాగుండాలంటే.. ఈ ఒక్కసారి ఇళ్లల్లో ఎందుకు ఉండొద్దు?. దయచేసి సవ్యంగా నడుచుకోండి. రేపటి భవిష్యత్ కోసం విజ్ఞతతో ప్రవర్తించండి' అని హర్భజన్ హెచ్చరించాడు.
నిజం చెప్పాలంటే.. మార్చి నెలలో క్రికెటర్లు ఎంతో బిజీగా ఉండేవారు. తమ ఫ్రాంచైజీల శిబిరాల్లో సాధన చేస్తూ గడిపేవారు. మైదానాల్లో ఎంతో సందడి ఉండేది. మహమ్మారి కరోనా ముప్పుతో ఐపీఎల్ను ఏప్రిల్ 15కు వాయిదా వేయడంతో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా పరిస్థితులు ఎలాగుంటాయో ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ జరుగుతుందా? లేదా అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ను జూన్-సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ యోచిస్తోందని తాజా సమాచారం. లాక్డౌన్ ప్రకటించగానే టీమ్ఇండియా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతూ ఈ విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.